హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కుమార్ పదే పదే తన అజ్ఞానాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు. తన పాదయాత్రలో భాగంగా సోమవారం మహబూబ్నగర్ జిల్లా ధన్వాడ మండలంలో ఉపాధి హామీ కూలీలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ పథకంపై(నరేగా) చిత్ర, విచిత్ర వ్యాఖ్యలు చేస్తూ, అడ్డగోలు హామీలు ఇస్తూ తనకు కనీస అవగాహన లేదని నిరూపించుకొన్నారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ వ్యాఖ్యలు, వాస్తవాలను ఓసారి పరిశీలిస్తే..
బండి సంజయ్: ఉపాధి హామీ నిధులను సీఎం కేసీఆర్ ఆపుతున్నారు.
వాస్తవం: కూలీలకు డబ్బు చెల్లింపులో రాష్ట్ర ప్రభుత్వం పాత్రేమీ లేదు. కేంద్ర ప్రభుత్వం నేరుగా కూలీల బ్యాంక్/ పోస్టల్ ఖాతాల్లో జమ చేస్తుంది. ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఇప్పటివరకు ఒక పైసా కూడా చెల్లించలేదు. కేంద్రం గతంలో కూలీలను ఎస్సీ, ఎస్టీ, ఇతరులుగా విభజించి, ఆ మేరకు ప్రాధాన్యం ప్రకారం చెల్లింపులు చేసేది.
బండి: మూడు నెలలుగా చెల్లింపులు ఆపేశారు. ఆ బకాయిలన్నీ ఇప్పిస్తా
వాస్తవం: ఈ ఏడాది మార్చి 31 వరకు అప్లోడ్ చేసిన కూలీలందరికీ కేంద్రమే నేరుగా వారి ఖాతాల్లో డబ్బు జమచేసింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు కూలీలు పనిచేసిన పని దినాలకు కార్డుల ప్రకారం రూ.216 కోట్లు కేంద్రం విడుదల చేయాల్సి ఉన్నది. ఎంజీఎన్ఆర్ఈజీఏ చట్టం ప్రకారం మస్టర్ పూర్తయిన 15 రోజుల్లో వేతనాలను కేంద్రం కూలీల ఖాతాల్లో జమ చేయాలి. కానీ 32 రోజులు గడిచినా ఇంకా చెల్లించలేదు. బండి సంజయ్కి అక్కడున్న కూలీలు కొన్ని ఫిర్యాదులు చేశారు. అందులోని వాస్తవాలను పరిశీలిస్తే..
కూలీలు: ప్రస్తుతం మాకు రోజు కూలీ రూ.257+20 మాత్రమే ఇస్తున్నారు.
వాస్తవం: ఏప్రిల్ 1వ తేదీ నుంచి కేంద్రం రోజువారీ ఉపాధి వేతనాన్ని రూ.245 నుంచి రూ.257కు పెంచింది. దానినే రాష్ట్రంలోనూ అమలుచేస్తున్నారు. పని ప్రదేశం 5 కిలోమీటర్ల పరిధి కంటే ఎకువ ఉంటే అదనంగా 10% కూలి చెల్లిస్తారు. అంటే రవాణా భత్యం కింద రూ.25.70 చెల్లిస్తున్నారు. కాబట్టి రాష్ట్రంలో నిబంధనలు కచ్చితంగా అమలవుతున్నాయి.
కూలీలు: మాకు ధన్వాడలో పని దొరుకడం లేదు. కాబట్టి మాకు అదనంగా కనీసం రూ.250 అయినా పెంచాలి.
వాస్తవం: ధన్వాడ గ్రామంలో దరఖాస్తు చేసిన ప్రతి ఒక్క కూలీకి పని కల్పిస్తున్నారు. ప్రస్తుతం ధన్వాడలో 310 మంది కూలీలు దత్తాత్రేయుని గుట్ట, సీతమ్మ గట్టు దగ్గర మట్టి పనులు (కందకాల పనులు) చేస్తున్నారు. శ్రమ ఎక్కువ కాబట్టి కూలి అదనంగా రూ.250 పెంచడంపై కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
బండి: పనిదినాలు మరో 50 రోజులు పెంచాలని ప్రధాని దృష్టికి తీసుకెళ్తా.
వాస్తవం: ఉపాధిహామీ పనిదినాల పెంపు అంశం కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది. ఉపాధిహామీ పథకాన్ని మరింత ప్రయోజనకారిగా మార్చేందుకు వ్యవసాయానికి అనుసంధానం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక విజ్ఞప్తులు చేసినా పట్టించుకోలేదు.