హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): గుమ్మడికాయల దొంగెవరంటే.. భుజాలు తడుముకున్న చందంగా ఉన్నది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీరు. కేంద్రంలో నిరంకుశ ప్రభుత్వం పోవాలని, ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలని సీఎం కేసీఆర్ టీఆర్ఎస్(బీఆర్ఎస్)ను జాతీయ పార్టీగా మారిస్తే ఆయన విమర్శించడమే ఎజెండాగా నోటికొచ్చినట్టు మాట్లాడారు. గురువారం మీడియా సమావేశంలో ఆయన అభద్రత భావానికి లోనయ్యారని గుసగుసలు వినిపించాయి.
ఓ వైపు బీఆర్ఎస్ను స్వాగతిస్తున్నామంటూనే.. మరోవైపు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సంబంధం లేకుండా ఏదేదో మాట్లాడుతూ అయోమయానికి గురయ్యారు. సీఎం కేసీఆర్ బండారం బయటపెడుతుందనే జాతీయ పార్టీ పెట్టారన్న ఆయన.. మోదీ ఎక్కడి నుంచి వచ్చి ప్రధాని అయ్యారో గుర్తు తెచ్చుకోవాలని తెలంగాణవాదులు సూచిస్తున్నారు. దేశాన్ని అధోగతి పాల్జేసిన బీజేపీ నేతలకు సీఎం కేసీఆర్ గురించి మాట్లాడే కనీస అర్హత లేదని వారు మండిపడుతున్నారు. రైతు సంఘాల నాయకులను, జాతీయస్థాయి నేతలను, మేధావులను కించపర్చేలా బండి మాట్లాడటం ఆయన అహంకారానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఎన్డీఏలో భాగస్వామ్యులంతా అవకాశవాదులేనా అంటూ ప్రశ్నిస్తున్నారు. దేశంలో బీజేపీ అరాచకాలు భరించలేకనే దేశ, రైతు క్షేమం కోరే నేతలు, పార్టీలు కేసీఆర్తో జత కడుతున్నాయని వారు స్పష్టం చేస్తున్నారు.