75 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న కవర్లపై నిషేధం
అన్ని మున్సిపాలిటీల్లో నేటి నుంచి అమలు
టాస్క్ఫోర్స్ బృందాల ఏర్పాటు
అతిక్రమిస్తే కఠిన చర్యలకు సిద్ధమవుతున్న బల్దియా
ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి
పర్యావరణానికి పెను ముప్పుగా పరిణమించిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ (75 మైక్రాన్ల కంటే తక్కువ మందం)కు పాతరేయాలని సర్కారు నిర్ణయించింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వీటి వినియోగం, సరఫరా, విక్రయంపై విధించిన నిషేధం నేటి నుంచే అమల్లోకి రానున్నది. ఈ మేరకు పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అతిక్రమించిన వారిపై కఠిన చర్యలకు ఉపక్రమించేందుకు యంత్రాంగం సన్నద్ధమవుతున్నది. ఈ దిశగా ప్రత్యేక టాస్క్ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేసింది.
పెద్దపల్లి జంక్షన్/కోల్సిటీ, జూన్ 30 : రోజురోజుకూ పెరుగుతున్న ప్లాస్టిక్ వినియోగంతో జీవుల మనుగడే ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి ఉన్నదని నిపుణులు, పర్యావరణవేత్తలు చెబుతున్నారు. ప్రభుత్వాలు మేలుకోకుంటే మున్ముందు ఈ సమస్య మరింత తీవ్రరూపం దాల్చే అవకాశమున్నదని పేర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్లాస్టిక్ కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని నిర్ణయించాయి. ఈ దిశగా జూలై 1నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై నిషేధాన్ని అమల్లోకి తెస్తూ రాష్ట్ర పురపాలక శాఖ జీవో జారీ చేసింది. పట్టణాలు, నగరాల్లో 75 మైక్రాన్ల మందం కంటే పల్చని కవర్లను వినియోగించినా, సరఫరా చేసినా, విక్రయించినా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయా బల్దియాల యం త్రాంగాలను ఆదేశించింది. అలాగే వచ్చే డిసెంబర్ నుంచి 100మైక్రాన్ల కంటే తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ కవర్లపై నిషేధాన్ని ప్రకటించింది.
చెత్తలో అధిక భాగం ఇదే
బల్దియాలు సేకరిస్తున్న చెత్తలో అధిక భాగం ప్లాస్టికే ఉంటుంది. కరీంనగర్లో నిత్యం వెలువడే 140 మెట్రిక్ టన్నుల వ్యర్థాల్లో అత్యధికంగా కనిపించేవి సింగిల్ యూజ్ కవర్లే. ఇష్టారాజ్యంగా వినియోగించి మురుగుకాలువల్లో పారవేస్తుండడంతో మురునీటి ప్రవాహానికి ఆటంకం కలుగుతుంది. వర్షాకాలంలోనైతే ఇబ్బందులు రెట్టిపంవుతున్నాయి. వరదనీటితో కలిసిన మురుగు రోడ్లపైకి చేరుతుండడంతో పారిశుధ్య లోపం తలెత్తుతున్నది. దుర్గంధం వెదజల్లుతుండడంతో ప్రజారోగ్యానికి హాని జరుగుతున్నది. అలాగే డంప్యార్డుల్లో గుట్టలు గుట్టలుగా పేరుకుపోతున్నది. కవర్లను కాల్చివేస్తే వీటిలోని రసాయనాలు వాతావరణంలో చేరి జీవులకు తీవ్రమైన హాని కలిగించే అవకాశాలు ఉన్నాయి.
కట్టడికి కట్టుదిట్టంగా..
ప్రభుత్వం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లపై నిషేధం విధించిన నేపథ్యంలో కరీంనగర్ బల్దియా యంత్రాంగం కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నది. మున్సిపల్ శాఖ నిర్దేశించిన మేరకు నిబంధనలు అమలుకు ఉపక్రమిస్తున్నది. ఇప్పటికే నగరంలోని ప్లాస్టిక్ వ్యాపారులతో నగర కమిషనర్ అవగాహన సమావేశం కూడా నిర్వహించారు. తమ వద్ద ఉన్న సింగిల్ యూజ్ కవర్లను వినియోగించవద్దని హెచ్చరించారు. ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చిచెప్పారు. అలాగే ప్రత్యేక టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు చేపడుతామని తెలిపారు. నగరవాసులు బల్దియా అధికారులకు సహకరించాలని కోరుతున్నారు.
ఉల్లంఘిస్తే ఉక్కుపాదం
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధానికి టాస్క్ఫోర్స్ బృందం ఏర్పాటు
కరీంనగర్ కలెక్టర్ కర్ణన్
కలెక్టరేట్, జూన్ 30: సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై ఉక్కుపాదం మోపుతున్నది. 75 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ కవర్ల వాడకంపై నిషేధాన్ని విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని గురువారం కలెక్టర్ కర్ణన్ తెలిపారు. నిషేధాన్ని కట్టుదిట్టంగా అమలు చేసేందుకు తన నేతృత్వంలో టాస్క్ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసిందని చెప్పారు. ఇందులో అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్), జడ్పీ సీఈవో, జిల్లా గ్రామీణాభివృద్ధి, పంచాయతీ అధికారులు, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్, డీసీటీవో ఇరిగేషన్ ఎస్ఈ, డీఈవో, నెహ్రూ యువ కేంద్ర కో ఆర్డినేటర్, జిల్లా యువజన సంక్షేమాధికారి, జిల్లా టూరిజం అధికారి, డీవీఈవో, బల్దియాల కమిషనర్లు, ఎస్బీఎం కన్సల్టెంట్లు, యూనిసెఫ్ ప్రాజెక్ట్ సిబ్బంది సభ్యులుగా ఉంటారని చెప్పారు. టాస్క్ఫోర్స్ టీంలు నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధిస్తారని పేర్కొన్నారు. అలాగే ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకారానికి హెల్ప్లైన్ నంబర్ను ఏర్పాటు చేశామని వెల్లడించారు.