న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: దేశంలో అక్రమ డిజిటల్ లెండింగ్ యాప్స్ అకృత్యాలు నానాటికీ పెరిగిపోతున్న నేపథ్యంలో వాటికి అడ్డుకట్ట వేసే దిశగా అడుగులు పడుతున్నాయి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో అక్రమ ఆన్లైన్ లోన్ యాప్స్కు సంబంధించిన పలు అంశాలపై చర్చ జరిగింది. సమావేశంలో కేంద్ర ఆర్థిక, ఆర్థిక వ్యవహారాలు, రెవిన్యూ, ఆర్థిక సేవలు, కార్పొరేట్ వ్యవహారాల శాఖల కార్యదర్శులతోపాటు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి, ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఇల్లీగల్ లోన్ యాప్స్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ప్రస్తుతం దేశంలో సక్రమంగా నడుస్తున్న అన్ని లోన్ యాప్స్ జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తయారు చేయాలని ఆర్థిక మంత్రి సూచించారు. ఈ జాబితాలోని యాప్స్ మాత్రమే యాప్ స్టోర్లలో ఉండేలా కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ చూసుకోనున్నది. దీంతో ఇప్పుడు యాప్ స్టోర్లలో కనిపిస్తున్న లోన్ యాప్స్లో సగం వరకు త్వరలోనే కనుమరుగైపోనున్నాయి.
లోన్ యాప్స్ వ్యవహారాన్ని ఆర్బీఐ క్షుణ్ణంగా పరిశీలించనున్నది. వీటి వెనుక ఉన్న సంస్థల వివరాలు, మనీ లాండరింగ్కున్న అవకాశాలపై ఆరా తీయనున్నది. అలాగే ఈ యాప్స్ అన్ని నిబంధనలను అనుసరించే నమోదయ్యాయా? లేదా? అన్నదీ సెంట్రల్ బ్యాంక్ పరిశీలించనున్నట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు చెప్తున్నాయి. రిజిస్ట్రేషన్ కాని యాప్స్పై వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుందని శుక్రవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో సదరు వర్గాలు స్పష్టం చేశాయి. బోగస్ కంపెనీలేవైనా లోన్ యాప్స్ను నిర్వహిస్తున్నాయా? అన్న కోణంలో కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సైతం దృష్టి పెట్టనున్నది.
లోన్ యాప్స్పై నియంత్రణ లోపం వల్లే అమాయకులు బలైపోతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రం ఆర్బీఐని అడ్డం పెట్టుకుని ఈ వ్యవహారం నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నదని అంటున్నారు. దేశంలో చలామణిలో ఉన్న చాలా డిజిటల్ లెండింగ్ యాప్స్ అక్రమంగా నడుస్తున్నవేనని అధికారిక గణాంకాలే చెప్తున్నాయి. ఆర్బీఐతో సంబంధం లేకుండా సొంతంగానే రుణ లావాదేవీలు జరుపుతున్నాయి. దీంతో రుణాల వసూళ్ల కోసం ఎంతకైనా తెగబడుతున్నాయి. వీటి వేధింపులను భరించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్లో రుణయాప్ నిర్వాహకుల వేధింపులు భరించలేక మరో యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం నారాయణపురంలో శివరాత్రి శివ (20) రూ.8 వేల రుణం తీసుకోగా.. రూ.24 వేలు కట్టాలని నిర్వాహకులు ఒత్తిడి చేశారు. దీంతో అతడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.