మలయాళీ యువ హీరో దుల్కర్ సల్మాన్ తాజా చిత్రం ‘సెల్యూట్’ వివాదంలో చిక్కుకుంది. పంపిణీదారులతో ముందస్తుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం థియేటర్లో కాకుండా..ఈ సినిమాను నేరుగా ఓటీటీలో విడుదల చేయడం ఈ వివాదానికి కారణమైంది. దీంతో కేరళ థియేటర్స్ అసోసియేషన్ ఆయన సినిమాలపై నిషేధం విధించింది. ఇక ముందు దుల్కర్ సల్మాన్ నటించిన సినిమాలను థియేటర్స్లో ప్రదర్శనకు అనుమతించబోమని అసోసియేషన్ స్పష్టం చేసింది. ఈ వివాదం పూర్వాపరాల్లోకి వెళితే… ‘సెల్యూట్’ చిత్రాన్ని దుల్కర్ సల్మాన్కు చెందిన వేఫెరర్ ఫిల్మ్స్ నిర్మించింది. ఈ ఏడాది జనవరి 14న విడుదల చేస్తామని ప్రకటించారు. డిస్ట్రిబ్యూటర్స్తో ఒప్పందాలన్నీ జరిగిపోయాయి. అనంతరం కొవిడ్ ఉధృతి పెరగడంతో సినిమా విడుదల వాయిదా పడింది. తాజాగా ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేశారు. ఈ నిర్ణయంతో ఆగ్రహం చెందిన కేరళ థియేటర్ అసోసియేషన్ దుల్కర్ సినిమాల్ని బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. తమతో కుదుర్చుకున్న ఒప్పందాల్ని ఉల్లఘించడంతో పాటు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఓటీటీ రిలీజ్ చేయడం పద్దతి కాదని డిస్ట్రిబ్యూటర్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.