బీజేపీ ఆఫీసు వద్ద పెట్టిన బోర్డును తొలగించాలి
లేకుంటే మోదీ బొమ్మకు చెప్పుల దండలు వేస్తాం
కేసీఆర్లో ఉగ్రనరసింహుడిని చూడబోతున్నారు
ప్రధాని నరేంద్ర మోదీకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది
టీఆర్ఎస్ సెంచరీ కొట్టి హ్యాట్రిక్తో గెలుస్తుంది
మీడియాతో బాల్క సుమన్, కేవీ వివేకానంద, మెతుకు ఆనంద్
హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): అన్ని విధానాల్లో విఫలమైన ప్రధాని మోదీ నాయకత్వంపై దేశ ప్రజలు మోదీ హఠావో-దేశ్ బచావో అంటూ నినదిస్తున్నారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద సీఎం కేసీఆర్పై ఏర్పాటు చేసిన బోర్డును వెంటనే తొలగించాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా బై బై మోదీ పేరుతో బోర్డు పెట్టి, చెప్పుల దండ వేస్తామని హెచ్చరించారు. పార్టీ కార్యాలయాల వద్ద పార్టీ విధానాలు, కార్యక్రమాలకు సంబంధించిన బోర్డులు పెడతారు కానీ కొత్త తరహా విధానానికి బీజేపీ తెరలేపిందని, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని చెప్పారు. ఆదివారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, మెతుకు ఆనంద్, ముఠా గోపాల్, నోముల భగత్, ఎమ్మెల్సీ విఠల్తో కలిసి మీడియాతో బాల్క సుమన్ మాట్లాడుతూ.. దేశానికి బీజేపీ, మోదీ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
బ్యాంకు అకౌంట్లో వేస్తామన్న రూ.15 లక్షలు, రైతుల ఆదాయం రెట్టింపు హామీలు ఏమయ్యాయని నిలదీశారు. నల్ల సాగు చట్టాల వల్ల 750 మంది రైతులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ఎన్నుకొన్న ప్రభుత్వాలను కూల్చటమే బీజేపీ పనిగా పెట్టుకొన్నదని, మహారాష్ట్రలో ఏం జరుగుతున్నదో ప్రజలు చూస్తున్నారని వెల్లడించారు. ప్రధాని మోదీ పర్యటనలన్నీ అదానీ కోసమేనని ఆరోపించారు. మోదీకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యిందని వ్యాఖ్యానించారు. దేశంలో 13 మంది ప్రధానులు ఎంత అప్పు చేశారో, మోదీ ఒక్కరే అంత అప్పు చేశారని విమర్శించారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ బీజేపీకి టీఆర్ఎస్ లాంటి పార్టీ తగలలేదని, వారికి ఇక్కడ టీఆర్ఎస్ అంటే ఏంటో చూపిస్తామని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్కు నాలుగు దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్నదని, మోదీలా నేరుగా సీఎం కాలేదని అన్నారు. సీఎంను వ్యక్తిగతంగా విమర్శిస్తే ఊరుకొనేది లేదని హెచ్చరించారు.
పార్లమెంట్లో చర్చ పెట్టాలి: కేపీ వివేకానంద
తెలంగాణకు కేంద్రంలోని బీజేపీ సర్కారు ఏం ఇచ్చిందో పార్లమెంట్లో చర్చ పెట్టాలని ఆ పార్టీ నేతలకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద సవాల్ విసిరారు. సీఎం కేసీఆర్ను విమర్శించే స్థాయి తరుణ్ చుగ్, బండి సంజయ్కు లేదని అన్నారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయిన తురుణ్ చుగ్.. కేసీఆర్ను విమర్శించటం అంటే స్థాయికి మించి మాట్లాడటమేనని చెప్పారు. టీఆర్ఎస్ మూడోసారి కూడా అధికారంలోకి వస్తుందని, సెంచరీ కొడుతామని స్పష్టం చేశారు. పశ్చిమబెంగాల్లో కాళికామాతను చూశారని, తెలంగాణలో కేసీఆర్ రూపంలో ఉగ్రనరసింహుడిని చూడబోతున్నారని తెలిపారు.
సింహం సింగిల్గానే వస్తది: మెతుకు ఆనంద్
తెలంగాణలో ఒక్క కేసీఆర్ను ఎదుర్కోవటానికి బీజేపీ నాయకులు వందల సంఖ్యలో వస్తున్నారని, కానీ కేసీఆర్ సింహం సింగిల్గానే వస్తుందని వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు. తెలంగాణ కేసీఆర్ అడ్డా అని, బీజేపీ నేత నడ్డా ఈ విషయం తెలుసుకోవాలని చురక అంటించారు. టీఆర్ఎస్ సర్కారు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలపై చర్చించడానికి తాను ఒక్కడినే ఏ రోజున, ఏ తేదీన, ఎక్కడికి రమ్మన్నా సిద్ధమని సవాల్ విసిరారు.