ప్రభుత్వ విప్ బాల్క సుమన్
చెన్నూర్, జూలై 7: రాష్ట్రంలోని దళితుల ఆర్థికాభివృద్ధికే దళిత బంధు పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని ప్రభుత్వ విప్, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. చెన్నూర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దళితబంధు లబ్ధిదారులకు గురువారం వాహనాలను పంపిణీ చేశారు. కోటపల్లి మండలంలో అన్నారం గ్రామానికి చెందిన దుర్గం సంజీవ్కు మంజూరైన బొలెరో, చెన్నూర్ మండలం అస్నాద్ గ్రామానికి చెందిన దాసరి సారయ్య, కోటపల్లి మండలం పారుపల్లి గ్రామానికి చెందిన పాలపుల చంద్రయ్య, బోగె రాజన్న, లింగన్నపేట గ్రామానికి చెందిన బొర్రగళ్ళ రమీన్కుమార్కు మంజూరైన ట్రాక్టర్లను విప్ బాల్క సుమన్ అందజేశారు. చెన్నూర్ పట్టణంలోని పద్మనగర్ కాలనీలో మొక్కలు నాటారు.
అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి..చెన్నూర్లో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అధికారులను ఆదేశించారు. రూ.15కోట్లతో ప్రధాన రహదారి విస్తరణ, మురుగు కాలువల నిర్మాణ పనులను పరిశీలించి సూచనలు చేశారు.
విశ్వబ్రాహ్మణ సంఘ భవనానికి రూ.10 లక్షలు మంజూరు
చెన్నూర్ పట్టణంలో విశ్వబ్రాహ్మణ కుల సంఘం భవన నిర్మాణానికి రూ 10లక్షల నిధులను మంజూరు చేసినట్లు ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తెలిపారు. ఈ ఉత్తర్వులను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కుల సంఘం నాయకులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ అర్చనా గిల్డా, వైస్ చైర్మన్ నవాజొద్దీన్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు దేశ్పాండే, ఎంపీపీ మంత్రి బాపు, జడ్పీటీసీ మోతె తిరుపతి, వైస్ ఎంపీపీ వెన్నపురెడ్డి బాపు రెడ్డి, చెన్నూర్ సింగిల్ విండో చైర్మన్ చల్ల రాంరెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచ్లు, టీఆర్ఎస్ నాయకులు, కౌన్సిలర్లు, అధికారులున్నారు.
మిషన్ భగరథ పనులు వేగంగా పూర్తి చేయాలి
రామకృష్ణాపూర్, జూలై 7 : చెన్నూర్ నియోజక వర్గంలో కొనసాగుతున్న మిషన్ భగీరథ పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ గురువారం క్యాతనపల్లి మున్సిపాలిటీలోని ఆయన స్వగృహంలో నియోజకవర్గంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. పలు వార్డుల్లో మిషన్ భగీరథ పనులను కౌన్సిలర్లను అడిగి తెలుసుకున్నారు. పూర్తి కానిచోట త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో మిషన్ భగీరథ ఈఈ (ఇంట్రా) అంజన్రావు, ఈఈ గ్రిడ్ మధుసూదన్, డీఈ (ఇంట్రా) వెంకటేశ్ డీఈ (గ్రిడ్) కృష్ణ, ఏఈ లు (ఇంట్రా), గ్రిడ్కు సంబంధించిన అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనుల్లో భాగంగా నిర్మిస్తున్న కల్వర్ట్ నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
పాఠశాల ఆధునీకరణ పనుల పరిశీలన..మందమర్రి మండలంలోని బొక్కలగుట్ట పంచాయతీలోని కోటేశ్వర్రావు పల్లెలో ‘మన ఊరు- మన బడి’ పథకం, ఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుంచి రూ.27.08 లక్షలతో మండల ప్రజా పరిషత్ పాఠశాలలో చేపట్టిన ఆధునీకరణ పనులను ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్, పాఠశాల మౌలిక వసతుల కల్పన కమిటీ రాష్ట్ర చైర్మన్ రావుల శ్రీధర్రెడ్డితో కలిసి గురువారం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్, జడ్పీటీసీ రవి, సర్పంచ్ బొలిశెట్టి సువర్ణ, అధికారులు, మాజీ ఎంపీపీ బొలిశెట్టి కనకయ్య, బలికొండ కిషన్, తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర కమిటీ చైర్మన్కు సన్మానం..జిల్లా పర్యటనకు వచ్చిన పాఠశాలల మౌలిక వసతుల కల్పన కమిటీ రాష్ట్ర చైర్మన్ రావుల శ్రీధర్రెడ్డికి పీఆర్టీయూ నాయకులు ఘనంగా స్వాగతం పలికి శాలువాలతో సన్మానించారు. పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు డాక్టర్ పార్వతి సత్యనారాయణ, మంచిర్యాల జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ధరణికోట వేణుగోపాల్, సూరినేని గంగాధర్ మాట్లాడుతూ చెన్నూర్ నియోజక వర్గంలో పాఠశాలలో మౌలిక వసతులు కల్పించేందుకు చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ కృషి చేస్తున్నారని తెలిపారు. స్పోకెన్ ఇంగ్లిషు మెటీరియల్ని డిజిటల్ కంటెంట్ రూపంలో అన్ని పాఠశాలలకు అందుబాటులో ఉండే విధంగా తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్లలో పొందుపరిస్తే అందరికీ సౌకర్యంగా ఉంటుందని వినతి పత్రం అందజేశారు.