న్యూఢిల్లీ: నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న పిల్ల ఏనుగును కాపాడేందుకు ఏనుగుల మంద కలిసికట్టుగా ముందుకు వచ్చాయి. అన్ని ఏనుగులు కలిసి దానిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఒక ఏనుగుల మంద నదిని దాటుతున్నది. ఈ సందర్భంగా కొన్ని ఏనుగులు ఆ నదిలో స్నానాలాచరించాయి. ఒక పిల్ల ఏనుగు కూడా తల్లి చెంత నదిలో జలకాలాడింది. అయితే సమీపంలో జలపాతం ఉండటంతో నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నది. దీంతో ఆ పిల్ల ఏనుగు కొట్టుకోపోసాగింది.
వెంటనే అప్రమత్తమైన తల్లి ఏనుగు ముందుకు వెళ్లి తొండం, పాదంతో పిల్ల ఏనుగును పట్టుకున్నది. దానిని ఒడ్డుకు చేర్చేందుకు విఫలయత్నం చేసింది. మందలోని మిగతా ఏనుగులు దీనిని గమనించాయి. వెంటనే సహాయం కోసం రంగంలోకి దిగాయి. పిల్ల ఏనుగును కాపాడటంలో తల్లి ఏనుగుకు అండగా నిలిచాయి. తమ తొండాలు, పాదాలతో పిల్ల ఏనుగును ఒడ్డుకు చేర్చాయి. అనంతరం పిల్ల ఏనుగుతో కలిసి ఆ ఏనుగుల మంద అక్కడి నుంచి వెళ్లిపోయింది.
కాగా, ‘ఏనుగుల ప్రపంచం’ అనే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇప్పటికే 21 లక్షల మంది ఈ వీడియోను వీక్షించారు. 2.5 లక్షల మంది లైక్ చేశారు. పలువురు నెటిజన్లు కూడా ఈ వీడియోపై ప్రశంసలు గుప్పించారు. నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న పిల్ల ఏనుగును కాపాడే క్రమంలో తల్లి ఏనుగుకు సహాయం కోసం ముందుకు వచ్చిన మిగతా ఏనుగుల తీరును మెచ్చుకున్నారు. మనుషుల కంటే ఏనుగులే నయం అని కొందరు వ్యాఖ్యానించారు.