కోల్కతా : పార్లమెంట్ సభ్యుడు, బీజేపీ మాజీ నేత బాబుల్ సుప్రియో శనివారం తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇటీవల కేంద్రమంత్రి వర్గంలో చోటు కోల్పోయిన విషయం తెలిసిందే. దీంతో అసంతృప్తిగా ఉన్న ఆయన ఆ పార్టీకి రాజీనామా చేశారు. ప్రస్తుతం అసన్సోల్ పార్లమెంట్ ఎంపీగా కొనసాగుతున్నారు. గత నెల రోజుల కిందట రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత ఏ ఇతర రాజకీయ పార్టీల్లో చేరడం లేదన్న ఆయన.. ఇవాళ టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ, రాజ్యసభ సభ్యుడు ఓబ్రెయిన్ ఆధ్వర్యంలో టీఎంసీలో చేరారు.
బాబుల్ సుప్రియో చేరికను టీఎంసీ పార్టీ ధ్రువీకరించింది. ‘ఇవాళ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు ఓబ్రెయిన్ సమక్షంలో మాజీ కేంద్రమంత్రి, ఎంపీ సుప్రియో తృణమూల్ కుటుంబంలో చేరారు’ అని టీఎంసీ ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఇదిలా ఉండగా.. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ శనివారం బాబుల్ సుప్రియో భద్రతను తగ్గించింది. ‘జెడ్’ కేటగిరి నుంచి ‘వై’ కేటగిరికి మార్చింది.