న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: మధుమేహానికి ఉపయోగించే ఆయుర్వేద ఔషధం బీజీఆర్-34 ఊబకాయాన్ని తగ్గించి, శరీర క్రియలను మెరుగుపరుస్తుందని ఎయిమ్స్ నిపుణుల పరిశోధనలో వెల్లడైంది. మూడేండ్లపాటు జరిపిన ఈ పరిశోధనకు ఎయిమ్స్ ఔషధాభివృద్ధి విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ సుధీర్ చంద్ర నాయకత్వం వహించారు. బీజీఆర్-34ను సీఎస్ఐఆర్ విస్తృత పరిశోధన అనంతరం రూపొందించింది. దీన్ని ఏఐఎంఐఎల్ కంపెనీ తయారు చేస్తున్నది.
బీజీఆర్-34 దానంతట అదే పనిచేస్తుందా? లేక ఏదైనా అలోపతి మందుతో కలిపి వాడాలా? ఎలా వాడితే ఏ స్థాయిలో పనిచేస్తుంది? అనే అంశంపై ఎయిమ్స్ బృందం పరిశోధన సాగింది. ఈ ఆయుర్వేద ఔషధం ఫాస్టింగ్ చక్కెర స్థాయిని మాత్రమే కాకుండా శరీర బరువును కూడా గణనీయంగా తగ్గించి వేస్తుందని తేలింది. కొవ్వును, ముఖ్యంగా ట్రైగ్లిజరైడ్స్ అనే చెడుకొవ్వును కరిగిస్తుందని వెల్లడైంది. త్వరలో ఈ పరిశోధన ఫలితాలను శాస్త్ర విషయాల జర్నల్లో ప్రచురితమవుతాయి.