హైదరాబాద్ : 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో దళితబంధులాంటి గొప్ప పథకం లేదని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. దళితబంధు పథకం సర్వేలో భాగంగా హుజూరాబాద్ సిర్సపల్లి గ్రామం, జమ్మికుంట పట్టణంలోని 24వ వార్డులో జరిగిన అవగాహన కార్యక్రమంలో సంక్షేమశాఖ మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ సంక్షేమానికి గత ప్రభుత్వాలు తెచ్చిన పథకాలు వారి జీవితాల్లో పెద్దగా మార్పు రాలేదన్నారు. కేవలం 20, 30, 40 శాతం సబ్సిడీతో పథకాలుండేవని, బ్యాంకర్లతో సమస్యలు ఎదురయ్యేవన్నారు. ఇప్పుడు అలా కాకుండా బ్యాంకులు, సబ్సిడీలతో సంబంధం లేకుండా రూ.10లక్షలు నేరుగా వారి ఖాతాల్లో జమవుతాయన్నారు. నిరుపేదలైన ఎస్సీల జీవన ప్రమాణాలను పెంచేందుకు స్వయం పోషకులను చేసేందుకు సీఎం కేసీఆర్ మహత్తర పథకాన్ని తీసుకొచ్చారన్నారు.
పథకం దళితులందరికీ వర్తిస్తుందని, ఈ డబ్బుతో దుకాణాలు, వ్యాపారాలు చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా భాగ్య అనే మహిళ తాను ఎస్సీనని.. భర్త బీసీ అని.. పథకం తనకు వర్తిస్తుందా? అని మంత్రిని అడగ్గా.. ఏ కులంలో పుడితే అదే కులమే వర్తిస్తుందని.. రూ.10లక్షలు వస్తాయంటూ భరోసా ఇచ్చారు. ఎల్లవ్వ అనే మహిళ ట్రాలీ కొని నడుపుకుంటానని.. దీప్తి అనే యువతి టైలర్ షాప్ పెట్టుకుంటానని మంత్రికి తెలిపారు. పెళ్లి చేసుకున్న కొడుకులను వేరే కుటుంబంగా భావించి.. పథకాన్ని అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. పథకంతో వ్యాపారులు, పనులు చేసుకొని ఉన్నతంగా, ఆత్మగౌరవంతో జీవించాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు, టీఆర్ఎస్ పట్టణ శాఖ అధ్యక్షుడు రాజ్ కుమార్, కౌన్సిలర్లు మల్లయ్య, రవీందర్, టీఆర్ఎస్ నాయకులు కోటి తదితరులు ఉన్నారు.