కాట్మండు: నేపాల్లో భారీ హిమపాతం సంభవించింది. ఒక్కసారిగా హిమపాతం దూసుకువచ్చి బేస్ క్యాంప్లోని టెంట్లను ధ్వంసం చేసింది. పర్వతారోహకులు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని తలో దిక్కు పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నారు. ఈ ఘటన ఆదివారం ఉదయం మౌంట్ మానస్లూలో సంభవించింది. గత వారం క్రితం ఇదే మాదిరి హిమపాతం దూసుకువచ్చిన ఘటనలో ఇద్దరు పర్వతారోహకులు మరణించారు.
నేపాల్లోని మానస్లూ పర్వతంపై ఆదివారం ఉదయం హిమపాతం సంభవించింది. ఇందులో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే, హిమపాతం కారణంగా ఎవరెస్ట్ బేస్ క్యాంప్లోని చాలా టెంట్లు ధ్వంసమయ్యాయి. ఆ ప్రాంతంలో హెలికాప్టర్తో రెస్క్యూ సెర్చ్ ఆపరేషన్ చేపడుతున్నారు. అంతకుముందు సెప్టెంబర్ 26 న ఇదే ప్రాంతంలో హిమపాతం సంభవించడంతో ఇద్దరు పర్వతారోహకులు మరణించారు. వీరిలో ఒకరు నేపాలీ కాగా, మరొకరు అమెరికా పౌరుడు. ఈ ప్రమాదంలో 12 మంది పర్వతారోహకులు గాయాలపాలయ్యారు.
మానస్లూ పర్వతం ప్రపంచంలోని 8వ ఎత్తైన శిఖరం. ఎవరెస్ట్ పర్వతం అధిరోహణకు ఇది బేస్ క్యాంప్. దీని ఎత్తు సముద్ర మట్టానికి 8,163 మీటర్లు. నేపాల్ ప్రభుత్వం ఈ సంవత్సరం 58 వేర్వేరు బృందాలకు చెందిన 506 మంది పర్వతారోహకులను పర్వతాలను అధిరోహించేందుకు అనుమతించింది. మౌంట్ మానస్లూ ప్రపంచంలోని ఎనిమిదవ ఎత్తైన శిఖరంగా, 5వ అత్యంత ప్రమాదకరమైన శిఖరంగా పరిగణిస్తున్నారు. ఇక్కడ ఇప్పటివరకు 297 పర్వతారోహణల్లో 53 మంది పర్వతారోహకులు ప్రాణాలు కోల్పోయారు.