న్యూఢిల్లీ: అసలే కరోనాతో అన్ని రంగాలు కుదేలయ్యాయి. అందులో ఆటోమొబైల్ రంగం పరిస్థితి చెప్పనక్కర్లేదు. ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్నా.. ఇప్పట్లో కోలుకునే సంకేతాలు కనిపించడం లేదు.. దీనికి తోడు మార్కెట్లో పోటీని ఎదుర్కోవాల్సిన విపత్కర పరిస్థితి.. ఈ నేపథ్యంలో భవిష్యత్ ప్రాజెక్టులను చేపట్టే విషయంలో ఆటోమొబైల్ సంస్థలు తమ ఫోకస్ మార్చేశాయి.
ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఖర్చులు తగ్గించుకోవాలి.. భవిష్యత్ ప్రాజెక్టులను చేపట్టాలంటే టెక్నాలజీ అభివ్రుద్ధిపైనే పెట్టుబడులు మరింత పెంచడానికి ఆటోమొబైల్ సంస్థలు మొగ్గు చూపుతున్నాయి. పోటీ మార్కెట్లో రంగంలో నిలవాలంటే దీర్ఘకాలిక వ్యూహంతో పెట్టుబడులు పెట్టడానికి ప్రాధాన్యమిస్తున్నాయి.
టాటా టెక్నాలజీస్, కేపీఐటీ, కాప్జెమినీ, టాటా ఎల్సికి నూతన ప్రాజెక్టులు స్వీకరించాయి. ఈ ఏడాదిలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (ఆర్ అండ్ డీ) కోసం ఆటోమోటివ్ కంపెనీలు సగటున 6.5 శాతం నిధులు ఎక్కువగా ఖర్చు చేయనున్నాయి.
మున్ముందు ఆటోమొబైల్ ప్రాజెక్టుల్లో కొంత వరకైనా విద్యుద్ధీకరణ తప్పకపోవచ్చునని టాటా టెక్నాలజీస్ సీఈవో వారెన్ హరీస్ చెప్పారు. ప్రొడక్షన్ కాస్ట్ తగ్గింపు, ముడి సరుకుల సేకరణలో హేతుబద్ధీకరణ, ఉద్యోగులను తగ్గించుకోక తప్పదన్నారు.
ఇక ఆర్ అండ్ డీ తోపాటు సాఫ్ట్వేర్, ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీస్) రూపకల్పనపై ఆటోమేకర్లు ఫోకస్ చేశారని బిజినెస్ ఇంటెలిజెన్స్ సంస్థ ఐహెచ్ఎస్ మార్కిట్ పేర్కొంది. టెక్నాలజీపై ఖర్చు సానుకూలంగా ఉందని టెక్ సంస్థ కేపీఐటీ పేర్కొంది.
ఎలక్ట్రిక్ వెహికల్స్, ఆటానమస్ వెహికల్స్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీల రూపకల్పనపైనే భవిష్యత్ ఆధార పడి ఉంది. ఈ రంగాల టెక్నాలజీ అభివ్రుద్ధికి ప్రపంచ వ్యాప్తంగా భవిష్యత్లో భారీ మొత్తంలో ఆటో సంస్థలు పెట్టుబడులు పెడతాయని కేపీఐటీ, కాప్జెమిని, టాటా టెక్నాలజీస్ పేర్కొన్నాయి.
ఇతర బిజినెస్ ఏరియాల్లో ఖర్చు తగ్గించుకుని ఆటోమేకర్లు దేశీయ మార్కెట్లో విద్యుత్ వాహనాల తయారీపై ఫోకస్ చేశాయి. భారత్లోనూ విద్యుత్ వాహనాల తయారీకి భారీ మొత్తంలో పెట్టుబడులు వచ్చి పడుతున్నాయి.
దేశీయ కార్పొరేట్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం&ఎం) వచ్చే మూడేండ్లలో విద్యుత్ వాహనాల కోసం రూ.3,000 కోట్లు ఖర్చు పెట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంది.
మరో దేశీయ సంస్థ టాటా మోటార్స్విద్యుత్ వాహనాలపై ఫోకస్ చేయనుంది. దీంతోపాటు మొత్తం ఆటో రంగం డెవలప్మెంట్కు ఈ ఏడాదిలోనే రూ.3000 ఖర్చు చేయనున్నది.
ఇటు మహీంద్రా అండ్ మహీంద్రా, అటు టాటా మోటార్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గణనీయ స్థాయిలో ఖర్చులు తగ్గించడంపై కేంద్రీకరించాయి.
విద్యుత్ వాహనాల ప్రాజెక్టుల్లో బ్యాటరీ టెక్నాలజీ, మేనేజ్మెంట్ సిస్టమ్స్, మోటార్స్, థర్మల్ మేనేజ్మెంట్ సిస్టమ్స్, పవర్ ఎలక్ట్రానిక్స్ అభివ్రుద్ధిపై పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉన్నాయి.
ఖర్చులు తగ్గించుకోవాలంటే మున్ముందు క్లౌడ్, డిజిటల్ సిస్టమ్స్ వైపు మళ్లాల్సిందేనని ఐటీ, ఆటో నిపుణులు చెబుతున్నారు. డిజిటల్ రంగంలోకి వెళ్లడం వల్ల చాలా పొదుపు చేయొచ్చు.
క్యాప్ జెమినీ వైస్ ప్రెసిడెంట్ శామిక్ మిశ్రా మాట్లాడుతూ పైలట్ ప్రాజెక్టులు మినహా భారత్లో ఆటానమస్ టెక్నాలజీపై ఖర్చు అతి తక్కువ అని చెప్పారు.