మెల్బోర్న్: పాకిస్థాన్లో క్రికెట్ ఆడాలంటే ఈజీగా నో చెప్పేస్తారు. ఎందుకంటే అది పాకిస్థాన్ కాబట్టి. బంగ్లాదేశ్ విషయంలోనూ ఇలాగే జరుగుతుంది. కానీ ఇండియాకు మాత్రం ఎవరూ నో చెప్పరు అని అన్నాడు ఆస్ట్రేలియా బ్యాటర్ ఉస్మాన్ ఖవాజా. పాకిస్థాన్లో పుట్టిన ఈ ఆస్ట్రేలియా ఓపెనర్.. న్యూజిలాండ్, ఇంగ్లండ్ టీమ్స్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. పాకిస్థాన్లో ఈ మధ్యే ఈ రెండు టీమ్స్ తమ పర్యటనలను రద్దు చేసుకున్న విషయం తెలిసిందే.
దీనిపై ఖవాజా స్పందిస్తూ.. ప్లేయర్స్కు, సంస్థలకు పాకిస్థాన్కు నో చెప్పడం చాలా ఈజీ. ఎందుకంటే అది పాకిస్థాన్ కాబట్టి. బంగ్లాదేశ్ విషయంలోనూ ఇలాగే చేస్తారు. కానీ ఇండియాకు మాత్రం ఎవరూ నో చెప్పరు. ఇండియాలోనూ ఇలాంటి పరిస్థితులే ఉన్నా కాదని అనలేరు. ఎందుకంటే అక్కడ డబ్బు మాట్లాడుతుంది. మనందరికీ ఇది తెలుసు అని ఖవాజా అన్నాడు.
కొన్నేళ్లుగా ఎన్నో టోర్నీలు విజయవంతంగా నడిపిస్తూ తమ దేశం సురక్షితమైనదని పాకిస్థాన్ నిరూపిస్తూనే ఉన్నదని ఖవాజా చెప్పాడు. అక్కడ చాలా ఎక్కువ భద్రత ఉంది. నేనైతే అక్కడికి వెళ్లి ఆడతా. పదేళ్ల కిందట అక్కడ ముప్పు ఉందేమో కానీ ఇప్పుడు లేదు. నేను పీఎస్ఎల్ ప్లేయర్స్తోనూ మాట్లాడాను. వాళ్లంతా అక్కడ సురక్షితంగా ఉన్నదని చెప్పారు అని ఉస్మాన్ ఖవాజా అన్నాడు.