రెండు మోకాళ్లలో ఇబ్బంది కారణంగా రెండు సంవత్సరాలపాటు ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ టోర్నీని మిస్ అయిన భారత టెన్నిస్ ప్లేయర్ యూకీ భాంబ్రీ.. ఈసారి ఆసీస్ ఓపెన్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. మోకాళ్లలో టెండానైటిస్ కారణంగా 2019, 2020లలో ఈ టోర్నీని భాంబ్రీ మిస్ చేసుకున్నాడు.
ఆ తర్వాత కోలుకొని ఫ్లోరిడాలో జరిగిన ఛాలెంజర్ ఈవెంట్లో పాల్గొనేందుకు సిద్ధమయ్యాడు. కానీ ఆ సమయంలో అతనికి కరోనా సోకింది. కరోనా నుంచి కోలుకున్న తర్వాత మరోసారి కుడి మోకాలి గాయంతో ఆటకు దూరమయ్యాడు. ఈ సమయంలో అతని ర్యాంకింగ్ బాగా దిగజారింది.
అయితే గతేడాది ఫిబ్రవరిలో పునరాగమనం చేసిన అతను గాయం కారణంగా తన 100వ ర్యాంకును కాపాడుకున్నాడు. అయితే 2022 ఆగస్టులోగా అతను పన్నెండు టోర్నమెంట్లలో పోటీ పడాల్సి ఉంటుంది. లేదంటే ఈ ర్యాంకును కోల్పోతాడు. ఈ నేపథ్యంలోనే రెండు ఏటీపీ టూర్ ఈవెంట్లలో ఆడి తన పునరాగమనాన్ని చాటాడు.
ఇప్పుడు ఆస్ట్రేలియన్ ఓపెన్ తొలి రౌండ్ క్వాలిఫైయర్లలో ఆడేందుకు తహతహలాడుతున్నాడు. ఇప్పటికే మెల్బోర్న్ చేరుకున్న అతను.. ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టేశాడు. 29 ఏళ్ల యుకీ గతేడాది ఫిబ్రవరిలో గాయం నుంచి కోలుకొని మళ్లీ ఆట ప్రారంభించాడు.
2009 ఆస్ట్రేలియన్ ఓపెన్ బాయ్స్ సింగిల్స్ ఛాంపియన్గా నిలిచిన భాంబ్రి.. మెల్బోర్న్లో జరిగే క్వాలిఫైయర్స్లో తొలిసారి మెన్స్ సింగిల్స్ మ్యాచ్ గెలిచేందుకు కసిగా ఉన్నాడు.