న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13: కేంద్రం ముందు జాగ్రత్త లేకపోవటంతో కరోనా రెండో దశ విజృంభించినప్పుడు ఆక్సిజన్ అందక వేల మంది మరణించారు. ఇప్పటికీ ఆక్సిజన్ కొరత మరణాలపై కేంద్రం వివరాలను సేకరించలేదు. దీంతో పార్లమెంటరీ కమిటీయే ఓ అడుగు ముందుకేసి.. ఆక్సిజన్ కొరతతో చనిపోయిన వారి వివరాలతో ఆడిట్ రూపొందించాలని కేంద్ర ఆరోగ్యశాఖకు సిఫారసు చేసింది.
బాధిత కుటుంబాలను గుర్తించి పరిహారం అందించాలని తెలిపింది. ఇలాంటి సందర్భాల్లో ప్రభుత్వ శాఖల నుంచి పారదర్శకత, జవాబుదారీతనం కచ్చితంగా ఉండాలని స్పష్టం చేసింది. రాష్ర్టాలకు సరిపడా ఆక్సిజన్ అందజేయటంలో కేంద్రం విఫలమైందని వెల్లడించింది. కచ్చితంగా ఇది నిర్లక్ష్యమేనని పేర్కొన్నది.