కోల్కతా, మార్చి 27: పశ్చిమబెంగాల్లో తొలి విడుత పోలింగ్ మొదలైన వేళ అధికార తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య ‘ఆడియో’ వార్కు తెరలేచింది. తృణమూల్ నుంచి బీజేపీలో చేరిన ప్రళయ్రాయ్కి సీఎం మమత ఫోన్ చేసి.. నందిగ్రామ్లో తన విజయం కోసం పనిచేయాలని కోరినట్టు బీజేపీ ఓ ఆడియో క్లిప్ను విడుదల చేయడం కలకలం రేపింది. మమత అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆ పార్టీ ఈసీకి ఫిర్యాదుచేసింది. మరోవైపు, బీజేపీకి కౌంటర్గా తృణమూల్ కూడా ఓ ఆడియో క్లిప్ను విడుదల చేసింది. ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేయడంపై బీజేపీ నేత ముకుల్రాయ్ మరో నాయకుడితో మాట్లాడుతున్నట్టు ఆ ఆడియోలో ఉన్నది.
మమత ఓటమిని అంగీకరించారు: బీజేపీ
మమత ఓటమిని అంగీకరించారని ఆడియో క్లిప్ ద్వారా స్పష్టమవుతున్నదని బీజేపీ ఎద్దేవా చేసింది. అయితే ఆడియో టేప్ వాస్తవికతపై తృణమూల్ ప్రశ్నలు లేవనెత్తింది. అదేవిధంగా తమ మాజీ సహచరుడిని తిరిగి పార్టీలోకి రావాలని కోరడంలో తప్పులేదని పేర్కొన్నది.
బీజేపీ చెప్పినట్టు ఈసీ పనిచేస్తున్నది: తృణమూల్
పోలింగ్ బూత్లో ఏజెంట్లుగా స్థానికులే కాకుండా బయటివారిని కూడా అనుమతించేలా ఈసీని కోరాలని ముకుల్రాయ్.. శిశిర్తో అన్నట్టుగా ఉన్న ఆడియో టేప్ను తృణమూల్ విడుదల చేసింది. బీజేపీ చెప్పినట్టుగానే ఈసీ కొన్నిరోజులకు నిబంధనలు మార్చినట్టు తృణమూల్ ఆరోపించింది.
చిత్తం బెంగాల్పై!
బెంగాల్లో ఓట్లే లక్ష్యంగా మోదీ రెండోరోజు బంగ్లాదేశ్ పర్యటన
ఢాకా, మార్చి 27: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందడమే లక్ష్యంగా బంగ్లాదేశ్లో ప్రధాని మోదీ రెండో రోజు పర్యటన సాగింది. మథువా తెగ ప్రజల ఆరాధ్య దైవం, ఆధ్యాత్మిక గురువు హరిచంద్ ఠాకూర్ జన్మస్థలం ఓరకండిని మోదీ శనివారం సందర్శించారు. అక్కడి ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడ మథువ తెగ ప్రజలతో మాట్లాడారు. వారికి దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. పశ్చిమ బెంగాల్లోని చాలా అసెంబ్లీస్థానాల్లో మథువ తెగ ప్రజలు నిర్ణయాత్మక సంఖ్యలో ఓట్లను కలిగి ఉన్నారు. బెంగాల్లో దాదాపు 30 లక్షల మంది మథువ తెగ ఓటర్లు ఉన్నారు. అంతకుముందు ఈశ్వరీపూర్లోని శతాబ్దాలకాలం నాటి జెషోరేశ్వరీ కాళీమాత ఆలయంలో మోదీ ప్రత్యేక పూజలు చేశారు. ఇదిలా ఉండగా, మోదీ శనివారం తుంగిపారాలోని బంగబంధు షేక్ముజిబుర్ రహమాన్ సమాధి వద్ద నివాళులు అర్పించారు. ముజిబుర్ సమాధి వద్ద ఒక దేశ ప్రభుత్వాధినేత నివాళులు అర్పించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
షేక్ హసీనాతో భేటీ.. 5 ఒప్పందాలపై సంతకం
శనివారం మోదీ బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంలో భాగంగా 5 ఒప్పందాలపై సంతకం చేశారు. ఇరుదేశాల మధ్య తీస్తా నదీజలాల వివాదం పరిష్కారానికి భారత్ కృషి చేస్తున్నదని మోదీ అన్నారు.