దోమలగూడ : హైదరాబాద్ నగర నడిబొడ్డున ఉన్న కట్టమైసమ్మ దేవాలయంలో చోరీకి విఫలయత్నం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి…..చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ప్రాచీనమైన కట్టమైసమ్మ దేవాలయంలో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి యత్నించారు. మంగళవారం రాత్రి ఆలయంలోని ప్రధాన మార్గంలో ఉన్న గ్రిల్స్ను తొలిగించి, హుండీని పగలగొట్టే ప్రయత్నం చేసారు.
అయితే హుండీకి సెంట్రల్ లాకింగ్ ఉండడంతో, అది తెరుచుకోలేదు. ఆ పక్కనే ఉన్న మరో బీరువా తాళం తీసి ఉండడంతో, వాటిలో ఉన్న సెల్ఫోన్ను దోచుకున్నారు. బుధవారం ఉదయం దీన్ని గమనించిన ఆలయ నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటన స్థలానికి వచ్చి ఆలయంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. బుధవారం మధ్యాహ్నం ఆలయ ఈఓ సాంబశివ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.