లండన్, సెప్టెంబర్ 19: యూకేలోని లెస్టర్ నగరంలో మత ఉద్రిక్తతలు నెలకొన్నాయి. గత నెలాఖరులో దుబాయ్లో జరిగిన ఇండియా-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా అభిమానుల మధ్య ఘర్షణ జరిగింది. అనంతరం నగరంలో హిందూ, ముస్లిం గ్రూపుల మధ్య గొడవలు చోటుచేసుకున్నాయి. తాజాగా నగరంలోని పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. తూర్పు ఇంగ్లండ్ నగరమైన లెస్టర్లోని ఓ ఆలయ పరిసరాలు ధ్వంసమయ్యాయని, భారతీయ సమాజంపై జరిగిన హింసను తీవ్రంగా ఖండిస్తున్నట్టు లండన్లోని భారత్ హైకమిషన్ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది.
దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని యూకే అధికారులను కోరినట్టు తెలిపింది. నగరంలోని మెల్టాన్ రోడ్లో ఉన్న మతపరమైన ప్రాంతం వద్ద జెండా కూల్చివేత ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. హింసాత్మక ఘటనలకు సంబంధించి 15 మందిని అరెస్టు చేశారు. ఓ వైపు ‘జై శ్రీరామ్’ నినాదాలతో హిందూ గ్రూపులు ఆందోళన చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఇదే సమయంలో ఈ గ్రూపులు లెస్టర్ ముస్లింలకు చెందిన ఆస్తులను ధ్వంసం చేస్తున్నాయని అవతలి గ్రూపు ఆరోపించింది.