వాషింగ్టన్ డీసీలో రికార్డు స్థాయిలో 15 వేల మంది ప్రతినిధులు హాజరు
ప్రజా ప్రతినిధులు, సెలబ్రిటీలతో కళకళలాడిన అమెరికా రాజధాని
మాతృదేశ సేవలో ముందుంటాం : భువనేశ్ భుజాల, ఆటా ప్రెసిడెంట్
అమెరికాలోని వాషింగ్టన్ డీసీ వేదికగా మూడు రోజుల పాటు ప్రతిష్టాత్మకంగా జరిగిన ఆటా వేడుకలు ముగిశాయి. కరోనా తరువాత జరిగిన ఈ వేడుకల్లో భారత్కు చెందిన పలువురు ప్రముఖులతో పాటు తెలుగు వారు భారీగా పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ సాంప్రదాయ దుస్తులను ధరించి సందడి చేశారు. 140 మందికి పైగా పాల్గొన్న తెలుగు మన వెలుగు కార్యక్రమంలో కూచిపూడి, గోండి, లంబాడి తదితర సంప్రదాయ నృత్య ప్రదర్శనలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. బతుకమ్మ పైన ఆటా ముద్రించిన పుస్తకాన్ని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. శివమణి, థమన్ మ్యూజికల్ నైట్ శ్రోతలను ఉర్రుతలూగించింది. డ్రమ్స్ పైన శివమణి చేసిన విన్యాసం సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. ఈ సభలకు మగ్దూం సయ్యద్, రవి రాక్లే, సింగర్ సునీత వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.
ఈ ఆటా వేడుకల్లో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు ఆళ్ళ వేంకటేశ్వర రెడ్డి , గువ్వల బాలరాజు, కాలే యాదయ్య, బొళ్ళం మల్లయ్య యాదవ్, గ్యాదరి కిశోర్, వైజాగ్ పార్లమెంట్ సభ్యులు ఎంవీవీ సత్యనారాయణ, రాజమండ్రి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, భాను ప్రకాష్ రెడ్డి, పటేల్ రమేశ్ రెడ్డి, భవానీ మారికంటి, మన్నవ సుబ్బ రావు తదితరులు పాల్గొన్నారు.
ఆటా ప్రెసిడెంట్ భువనేశ్ బుజాల మాట్లాడుతూ.. ఆటా కార్యవర్గం తనపై ఉంచిన గురుతర బాధ్యతలకు ఎంతో రుణపడి ఉంటానని పేర్కొన్నారు. ఈ మహా సభలు నిర్వహించటానికి తోడ్పాటు అందించిన కాన్ఫరెన్స్ కన్వీనర్ సుధీర్ బండారు, కోఆర్డినేటర్ కిరణ్ పాశం తదితరులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కోర్ కమిటీ, ఆడ్ హాక్ కమిటీ, కాట్స్ టీం, వాలంటీర్స్ విశేష కృషి మూలంగానే ఘనంగా నిర్వహించగలిగామని, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు.