న్యూయార్క్: గంట వ్యవవధిలో 80 మిల్లీమీటర్ల వర్షం.. ఎక్కడ చూసిన నీరే.. రోడ్లన్నీ నదుల్లా మారిపోయాయి. బేస్మెంట్లు, సబ్వేలు నీటితో నిండిపోయాయి.. ఇదీ అమెరికాలోని న్యూయార్క్, న్యూజెర్సీలో పరిస్థితి. న్యూయార్క్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో గురువారం రాత్రి వరణుడు తన ప్రతాపం చూపించాడు. కుంభవృష్టి కురవడంతో గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదయింది. ఐడా తుఫాను ధాటికి వరదలు, బేస్మెంట్లలో చిక్కుకుని సుమారు 44 మంది చనిపోయారని అధికారులు తెలిపారు. న్యూయార్క్, న్యూజెర్సీ పూర్తిగా నీటమునిగాయని వెల్లడించారు.
దీంతో న్యూయార్క్లో అత్యవసర పరిస్థితి విధించినట్లు గవర్నర్ కేటీ హోచుల్ ప్రకటించారు. సబ్వేలను మూసివేశామని, రైళ్లను కూడా ఆపివేశామని తెలిపారు. లగార్డియా, జేఎఫ్కే విమానాశ్రయాలు ముంపునకు గురవడంతో వందల కొద్ది విమానాలను రద్దు చేశామన్నారు. పట్టణంలో ఇప్పటివరకు 12 మంది చనిపోయారని, మరో 11 మంది బేస్మెంట్లలో చిక్కుకుపోయారని వెల్లడించారు. అందులో 2 నుంచి 86 ఏండ్ల వయస్సులో ఉన్నవారే ఉన్నారన్నారు.
కాగా, తనకు ఇప్పుడు 50 ఏండ్ల వయస్సు ఉందని, ఇప్పటివరకు ఇలాంటి వానను తానెప్పుడూ చూడలేదని మెటోడిజా మిహజ్లోవ్ అనే వ్యక్తి చెప్పారు. తన రెస్టారెంట్లోకి భారీగా వరద నీరు వచ్చిచేరిందన్నారు.
న్యూయార్క్లోని సెంట్రల్ పార్క్ వద్ద గంట వ్యవధిలో 80 మిల్లీమీటర్లు (3.15 ఇంచ్లు) వర్షపాతం నమోదయిందని నేషనల్ వాటర్ సర్వీస్ (NWS) వెల్లడించింది.
ఇక న్యూజెర్సీలో ఐడా తుఫాను ధాటికి 23 మంది చనిపోయారని గవర్నర్ ఫిల్ మర్ఫీ తెలిపారు. సుమారు 60 వేల ఇండ్లకు కరెంటు సరఫరా నిలిచిపోయిందన్నారు.