హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గజ్వెల్ నియోజకవర్గంలో అస్ట్రోటర్ఫ్ ఫుట్బాల్ అకాడమీని ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర కీడ్రాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. గజ్వెల్ నియోజకవర్గంలో సమగ్ర క్రీడాభివృద్ధిపై మంత్రి తన కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మల్టీ పర్పస్ స్టేడియం, క్రికెట్ అభివృద్ధి కోసం స్టేడియం నిర్మాణానికి, గేమ్స్ విలేజ్కు 50 ఎకరాల భూమిని కేటాయించాలంటూ సిద్దిపేట కలెక్టర్కు లేఖ రాశారు. వీటితో పాటు పట్టణం శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో పర్యాటకుల కోసం బడ్జెట్ హోటల్ నిర్మాణానికి రెండెకరాల భూమిని కేటాయించాలని కోరారు.
ఈ సందర్భంగా ఫుట్బాల్ అకాడమీ ఏర్పాటుకు తక్షణం రూ.2కోట్లు విడుదల చేస్తూ.. జీఓ కాపీని టీఎస్ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డికి అందజేశారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ క్రీడల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో క్రీడామైదానాలు నిర్మిస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక, క్రీడా, సాంస్కృతిక శాఖ కార్యదర్శి కేఎస్ శ్రీనివాస రాజు, స్పోర్ట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి, సాట్స్ ఉన్నతాధికారులు సుజాత, సిద్దిపేట జిల్లా డీవైఎస్ఓ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.