డిస్పూర్ : అసోంలోని తిరుగుబాటు సంస్థ దిమాసా నేషనల్ లిబరేషన్ ఆర్మీ (డీఎన్ఎల్ఏ)కు చెందిన ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. కార్బి ఆంగ్లాంగ్ జిల్లాలో అసోం రైఫిల్స్, పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహిస్తుండగా.. ఆదివారం తెల్లవారు జామున ధనసిరి ప్రాంతంలోని అసోం-నాగాలాండ్ సరిహద్దు వద్ద కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో డీఎన్ఎల్ఏకు చెందిన ఆరుగురు మృతి చెందగా.. సంఘటనా స్థలం వద్ద పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు అసోం స్పెషల్ పోలీస్ డైరెక్టర్ జనరల్ జీపీ సింగ్ ట్వీట్ చేశారు. నాలుగు ఏకే-47, మరో నాలుగు తుపాకులు, భారీ స్థాయిలో పేలుడు పదార్థాలు, ఆయుధ సామగ్రిని బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఆపరేషన్లో కార్బి ఆంగ్లాంగ్, దిమా హసావో జిల్లా పోలీసులు బృందాలు పాల్గొన్నాయి. సరిహద్దుల్లో డీఎన్ఎల్ఏ సహ ఇతర ఉగ్రమూకల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.