హైదరాబాద్ : తెలంగాణ ప్రజలకు ప్రాతినిథ్యం వహించడం నా అదృష్టమని రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం ఆయన ట్విట్టర్లో ‘ఆస్క్ కేటీఆర్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ నెటిజన్ ‘జాతీయ రాజకీయాలపై మీ అభిప్రాయం ఏంటి? మేం మిమ్మల్ని భారతదేశానికి ఐటీ మంత్రిగా చూడాలనుకుంటున్నాం. దేశవ్యాప్తంగా ఐటీ పరిశ్రమ అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం’ అంటూ ట్వీట్ చేయగా.. సొంత రాష్ట్రానికి సేవ చేస్తూ సంతోషంగా ఉందని సమాధానం ఇచ్చారు.
మరో నెటిజన్ ఐటీఈఎస్ సెక్టార్లో పుణే.. హైదరాబాద్ కంటే మెరుగ్గా పని చేస్తోందంటూ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలు తెలంగాణను అవమానిస్తున్నారు. కానీ, వాస్తవం వేరు. ఇలాంటి నిరాధారమైన ప్రకటనలు చేస్తున్న నాయకులను అడ్డుకునేందుకు ఏమైనా చర్యలు తీసుకోవచ్చా?’ అని ట్వీట్ చేయగా.. మూర్ఖత్వాన్ని విస్మరించడం ఉత్తమమని సమాధానం ఇచ్చారు. మరో నెటిజన్ ‘21వ శతాబ్దాన్ని దాటి రెండు దశాబ్దాలు గడిచిపోయాయి. కేంద్రంలో ఏడు సంవత్సరాలుగా అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ ఇప్పటికీ తాను చేసిన సరైన అభివృద్ధిని (ఏదైనా ఉంటే) ఓటర్ల ముందుంచడానికి బదులుగా మతం చుట్టూ తిరుగుతోందని, బీజేపీ తీరును ఎలా చూస్తున్నారు’ అన్ని ప్రశ్నించారు.
‘సహజంగా వారు ఏమీ చేయనందున.. చేసిన పని గురించి ఎక్కువగా మాట్లాడలేరు’ అన్నారు. ఈ సందర్భంగా పలువురు సహాయం అభ్యర్థించగా.. ఆదుకునేందుకు కేటీఆర్ ముందుకు వచ్చారు. ఫైబర్నెట్ ద్వారా తొలిదశలో ఏప్రిల్ 22 కల్లా గ్రామాల్లో ఇంటర్నెట్ అందుతుందన్నారు. యూపీలో రాజకీయలపై వచ్చిన ప్రశ్నలకు.. ప్రస్తుతం ఎస్పీకి అనుకూల పరిస్థితులు ఉన్నాయని.. ప్రజలు శాంతి, సుస్థిరత కోరుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో సుపరిపాలన, అభివృద్ధిపై దృష్టి సారిస్తున్నట్లు పేర్కొన్నారు.