ఆసియా కప్లో భారత ఇన్నింగ్స్ దాదాపు ముగిసింది. సూపర్-4 దశలో వరుస ఓటములతో టీమిండియా ఫైనల్ చేరే అవకాశాలు దాదాపు మాయమయ్యాయి. ఈ క్రమంలో భారత జట్టు ఆటతీరుపై పలువురు ప్రశ్నలు లేవనెత్తారు. ఇదే విషయాన్ని మాజీ స్టార్ ఆటగాడు రాబిన్ ఊతప్ప కూడా ఎత్తిచూపాడు.
రోహిత్ సేన జట్టులో మార్పులు లేకుండా ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోవడం కూడా విమర్శలకు తావిస్తోంది. దీనిపై ఊతప్ప మాట్లాడుతూ.. ‘‘భారత జట్టు చాలా ప్రయోగాలు చేస్తోంది. అక్కడ లేని సమస్యను పరిష్కరించడానికి ట్రై చేస్తోంది. చివర్లో వికెట్లు లేకుండా ఎంత ఎగ్రెసివ్గా ఆడినా చివరకు ఉపయోగం ఉండదు’’ అని తేల్చేశాడు.
అదే సమయంలో టెస్టు స్పెషలిస్టు ఛతేశ్వర్ పుజారా కూడా భారత జట్టు ఆటతీరును ప్రశ్నించాడు. తొలి రెండు మ్యాచుల్లో ఆడిన దినేష్ కార్తీక్ను కొనసాగించాల్సిందని అభిప్రాయపడ్డాడు. కేవలం లెఫ్ట్ హ్యాండర్ లేడనే కారణంతో అతన్ని పక్కన పెట్టారంటూ ఆ నిర్ణయాన్ని తప్పుబట్టాడు.
కాగా, డికే స్థానంలో జట్టులోకి తీసుకున్న రిషభ్ పంత్ బ్యాటుతో తీవ్రంగా నిరాశపరచగా.. దీపక్ హుడా కొత్తగా అప్పజెప్పిన ఫినిషర్ బాధ్యతను నిర్వర్తించలేక తంటాలు పడుతున్నాడు.