జైపూర్ : అత్తింట్లో వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన యువతి (25)ని మభ్యపెట్టి లైంగిక దాడికి పాల్పడిన ఏఎస్ఐని అరెస్ట్ చేసిన ఘటన రాజస్ధాన్లోని జలవర్ జిల్లాలో గురువారం వెలుగుచూసింది. నిందితుడు జగదీష్ ప్రసాద్(59) బల్టా పోలీస్ స్టేషన్లో అసిస్టెంట్ సబ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్నాడు.
జనవరిలో అత్తింటి వారు వేధిస్తున్నారని ఫిర్యాదు చేసిన మహిళ కేసును ప్రసాద్ దర్యాప్తు అధికారిగా పర్యవేక్షిస్తున్నారు. దర్యాప్తు పేరుతో యువతికి తరచూ ఫోన్లు చేస్తూ వేధింపులకు గురిచేస్తున్నాడు. సోమవారం రాత్రి గ్రామంలో ఓ పెండ్లికి యువతి రావడంతో అక్కడకు చేరుకున్న నిందితుడు ఆమెను బయటకు పిలిచి తన బైక్పై అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు.
అనంతరం ఆమెను పెండ్లి వేదిక వద్ద విడిచిపెట్టి పరారయ్యాడు. యువతి జరిగిన విషయం తన భర్తకు తెలపడంతో మంగళవారం సాయంత్రం వారు ప్రసాద్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి నిందితుడు ప్రసాద్ను అదుపులోకి తీసుకున్నామని సర్కిల్ అధికారి గిరిధర్ సింగ్ తెలిపారు.