శ్రీశైలం : శ్రావణమాస బహుళ అష్టమి సందర్భంగా శ్రీశైలం దేవస్థానంలో గోకులాష్టమి వేడుకలు శాస్త్రోక్తంగా నిర్వహించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్ లవన్న తెలిపారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల ఆలయ ప్రాకారంలో ఉన్న శ్రీగోకులం వద్ద 11 గోవులకు, 11 లేగదూడలకు విశేష పూజాలు చేశారు. దేశ ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖః సంతోషాలతో ఉండాలని, వర్షాలు బాగా కురిసి పంటలు సమృద్ధిగా పండాలని అర్చక స్వాములు మహా సంకల్పాన్ని పఠించి శ్రీసూక్త సహిత గో అష్టోత్తర షోడశోపచార పూజా క్రతువులను నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ పురాణ ఇతిహాసాలలో గోవుకు విశేష స్థానం ఉందని.. సకల దేవతల ఆవాస స్థానం గోమాత కావడంతో ఒక్క గోమాతను పూజిస్తే దేవతలందరినీ పూజించిన ఫలితం కలుగుతుందన్నారు. దేవస్థానం నిర్వహిస్తున్న గోశాలలో సుమారు 1150 గోవులు సంరక్షింపబడుతున్నాయని తెలిపారు. గోవులను కాపాడుకోవడం ప్రతిఒక్కరి బాధ్యత అని గుర్తుచేశారు. గో సంరక్షణకు దాతలు మరింత ముందుకు రావాలని ఆయన కోరారు.