లండన్ : వింబుల్డన్ మహిళల సింగిల్స్ విజేతగా ఆష్లే బార్టీ విజయం సాధించింది. శనివారం జరిగిన మ్యాచ్లో ఫైనల్ కరోలినా ప్లిస్కోవాపై గెలుపొందింది. కెరీర్లో తొలి వింబుల్డన్ టైటిల్ను బార్టీ కైవసం చేసుకుంది. ప్లిస్కోవాపై 6-3, 6-7, 6 -3 తేడాతో గెలుపొందింది. 1980 తర్వాత వింబుల్డన్ ట్రోఫీ గెలిచిన ఆస్ట్రేలియా క్రీడాకారిణిగా బార్టీ రికార్డు సృష్టించింది. బార్టీ ఫైనల్ మ్యాచ్లో చెక్ రిపబ్లిక్కు చెందిన ప్లిస్కోవాతో తలపడింది. తొలి సెట్లో బార్టీ సునాయాసంగా 6-3తో దూసుకెళ్లింది. మ్యాచ్ ప్రారంభం అయిన వెంటనే వరుసగా రెండు బ్రేక్ పాయింట్లు సాధించి 4-0తో నిలిచింది. కానీ ప్లిస్కోవా ఆ తర్వాత కాసేపు ప్రతిఘటించింది.
అయినా.. బార్టీ 6-3తో తొలి సెట్ కైవసం చేసుకుంది. రెండో సెట్లో మాత్రం ప్లిస్కోవా బలంగా పుంజుకున్నది. రెండో సెట్లో చాంపియన్ షిప్ కోసం బార్టీ సర్వ్ చేసినా.. ప్లిస్కోవా బ్రేక్ చేసింది. దీంతో 6-6తో సెట్ టై బ్రేకర్గా మారింది. మంచి జోరు మీద ఉన్న ప్లిస్కోవా ఆ టై బ్రేకర్లో ఆధిపత్యం సాధించి రెండో సెట్ కైవసం చేసుకుంది. కీలకమైన మూడో సెట్లో బార్టీ తన క్లాస్ ఆటను ప్రదర్శించి.. చివరకు 6-3 తేడాతో మూడో సెట్తో పాటు చాంపియన్గా నిలిచింది. బార్టీ తన ఖాతాలో రెండో గ్రాండ్స్లామ్ టైటిల్ వేసుకుంది. అంతకు ముందు 2019లో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ను గెలిచింది.
ఇదిలా ఉండగా.. ఆస్ట్రేలియా నుంచి బార్టీ కంటే ముందు ఇద్దరే వింబుల్డన్ ఉమెన్స్ టైటిల్స్ గెలిచారు. మార్గరెట్ స్మిత్ కోర్ట్ తొలిసారిగా 1963లో వింబుల్డన్ గెలిచింది. అనంతరం 1965, 1970లో వింబుల్డన్ చాంపియన్గా నిలిచింది. ఆ తర్వాత ఎవొన్నే గూలాగోంగ్ కావ్లే 1971, 1980లో ఆమె రెండుసార్లు చాంపియన్గా నిలిచింది. ఆ తర్వాత మరో ఆస్ట్రేలియన్ క్రీడాకారిణి వింబుల్డన్లో విజయం సాధించలేకపోయారు. తాజాగా 41 ఏళ్ల తర్వాత బార్టీ వింబుల్డన్ విజేతగా నిలిచి.. రికార్డు సృష్టించింది.