బాలానగర్, సెప్టెంబర్ 6: అర్హులైన వారందరికీ ఆసరా పింఛన్లు అందజేయనున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పేర్కొన్నారు. మంగళవారం ఓల్డ్బోయిన్పల్లి డివిజన్ పరిధి భాగ్యశ్రీగార్డెన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయనతో పాటు ఎమ్మెల్సీ నవీన్కుమార్, డివిజన్ కార్పొరేటర్ ముద్దం నర్సింహయాదవ్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓల్డ్బోయిన్పల్లి డివిజన్కు చెందిన 1300 మందికి మంజూరైన నూతన ఆసరా పింఛన్లు లబ్ధిదారులకు వారు అందజేశారు. కార్యక్రమం అనంతరం లబ్ధిదారులందరికి భోజన వసతిని ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం.. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం వల్లనే తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతున్నదన్నారు. కూకట్పల్లి నియోజకవర్గంలో 10,372 మందికి కొత్తగా ఆసరా పింఛన్లు మంజూరయ్యాయన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే 24 గంటల పాటు నిరంతర విద్యుత్ సరఫరా అవుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.
నిరుపేద ఆడబిడ్డల పెండ్లి కోసం కల్యాణలక్ష్మి పథకం ద్వారా రూ.1లక్ష 116లు అందజేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందన్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎక్కడైనా కల్యాణలక్ష్మి పథకం అందజేసే దమ్ముందా అని ఆయన ప్రశ్నించారు. రైతులకు మేలు చేసేందుకు రైతుబంధు, రైతుబీమ పథకాలు అందిస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. కూకట్పల్లి నియోజకవర్గం పరిధిలో అర్హులైన వారికి డబుల్ ఇండ్ల పంపిణీ కార్యక్రమం త్వరలో చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. దరఖాస్తుల పరిశీలన ప్రస్తుతం జరుగుతున్నదన్నారు. కూకట్పల్లి నియోజకవర్గానికి చెందిన వారికి 4400 డబుల్ ఇండ్లు నిర్మాణ పనులు పూర్తై పంపిణీకి సిద్ధంగా ఉన్నాయన్నారు. కూకట్పల్లి నియోజకవర్గం పరిధిలోని 12వేల మంది విద్యార్థులకు రూ. 2500 విలువ గల కిట్లు తన స్వంత నిధుల నుంచి అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో నరేందర్గౌడ్, కర్రె జంగయ్య, బల్వంత్రెడ్డి, మక్కల నర్సింగ్, కర్రె లావణ్య, సయ్యద్ ఎజాజ్, ఇర్ఫాన్, హరినాథ్, ఖదీర్, పోచయ్య, ఉదయరాణి, రాజేశ్వరి, లలిత, దుర్గ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ గార్డెన్లో పంపిణీ..
కూకట్పల్లి నియోజకవర్గం పరిధి బాలానగర్ డివిజన్కు చెందిన అర్హులైన లబ్ధిదారులకు బుధవారం పాతవిమానాశ్రయం రోడ్డులోని తెలంగాణ గార్డెన్లో పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో తాను ఎమ్మెల్సీ నవీన్కుమార్తో కలిసి కొత్తగా మంజూరైన పింఛన్లు లబ్ధిదారులకు అదజేయనున్నట్లు ఆయన తెలిపారు.