హైదరాబాద్ : గణేష్ చతుర్ధి సందర్భంగా ఆగస్ట్ 31న బెంగళూర్లో మాంసం విక్రయాలను కర్నాటక ప్రభుత్వం నిషేధించడం పట్ల ఏఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. కర్నాటక ప్రభుత్వం సంపన్నవర్గాలకు కొమ్ముకాసే సర్కార్ అని దుయ్యబట్టారు. మాంసం విక్రయాలపై నిషేధం విధించడం వృత్తి హక్కును నిరాకరించడంతో పాటు జీవనోపాధి, ప్రైవసీ హక్కులను కాలరాయడమేనని ఎంపీ ఓవైసీ ఆందోళన వ్యక్తం చేశారు.
వినాయకచవితి రోజు ఆగస్ట్ 31న మాంసం విక్రయాలను బృహత్ బెంగళూర్ మహానగర పాలికె (బీబీఎంపీ) నిషేధించింది. బీబీఎంపీ పరిధిలోని అన్ని ప్రాంతాలకు ఈ నిషేధం వర్తిస్తుంది. ఆగస్ట్ 31న వినాయక చవితి రోజు మాంసం విక్రయాలు, జంతు వధను నిషేధించామని బీబీఎంపీ జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. గతంలో కృష్ణాష్టమి సందర్భంగా కూడా బెంగళూర్లో జంతు వధ, మాంసం విక్రయాలను బీబీఎంపీ నిషేధించింది.