హైదరాబాద్ : పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇటీవల ఆరెస్సెస్పై చేసిన వ్యాఖ్యలపై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. ఆరెస్సెస్ గతంలో ఉన్నంత చెడ్డగా లేదని దీదీ చేసిన వ్యాఖ్యలపై ఎంపీ ఓవైసీ విరుచుకుపడ్డారు. మమతా బెనర్జీ నిజాయితీని, నిలకడ ధోరణిని టీఎంసీ ముస్లిం నేతలు ప్రశంసిస్తారని గురువారం ట్వీట్ చేశారు.
2003లోనూ మమతా బెనర్జీ ఆరెస్సెస్ను దేశభక్తులుగా కీర్తించారని గుర్తు చేశారు. ఆరెస్సెస్లో ఇప్పటికీ చాలా మంది మంచివారున్నారని, వారు బీజేపీకి మద్దతివ్వబోరని, వారంతా ఏదో ఒక రోజు మౌనం వీడతారని దీదీ పేర్కొన్నారని ఓవైసీ ప్రస్తావించారు. ఆరెస్సెస్పై ప్రశంసలు గుప్పించగా వారు తిరిగి దీదీని దుర్గగా అభివర్ణించారని చెప్పుకొచ్చారు.
ఆరెస్సెస్ హిందూ రాజ్యాన్ని కాంక్షిస్తుందని, దాని చరిత్రంతా ముస్లిం వ్యతిరేకతే కనిపిస్తుందని ఓవైసీ పేర్కొన్నారు. దీదీ నిజాయితీని టీఎంసీ ముస్లిం నేతలు ప్రశంసిస్తారని ఆశిస్తున్నామని ఓవైసీ వ్యంగ్యంగా అన్నారు. మరోవైపు ఆరెస్సెస్పై మమతా బెనర్జీ వ్యాఖ్యల పట్ల బెంగాల్ ఇమాం అసోసియేషనన్ చీఫ్ మహ్మద్ యాహ్య స్పందించారు. 20 కోట్ల మంది ముస్లింలు మమతా బెనర్జీని సెక్యులర్ నేతగా భావిస్తున్న క్రమంలో ఆమె చేసిన వ్యాఖ్యలు సానుకూలంగా లేవన్నారు.