న్యూఢిల్లీ: దేశంలోని జైళ్లలో జైళ్ల సామర్థ్యానికి మించి ఖైదీలు ఉన్నారని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ( Ministry of Home Affairs ) రాజ్యసభలో ఒక ప్రకటన చేసింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) నివేదిక ప్రకారం.. 2019 డిసెంబర్ 31 నాటికి దేశంలోని అన్ని జైళ్లలో కలిసి మొత్తం 4,78,600 మంది ఖైదీలు ఉన్నారని హోంశాఖ ప్రకటించింది. అయితే, జైళ్ల సామర్థ్యం మాత్రం 4,03,739 మంది ఖైదీలకు మాత్రమే సరిపోయేలా ఉన్నదని తెలిపింది.
ఇదిలావుంటే, అక్టోబర్లో కశ్మీర్లో నివసించే 115 కశ్మీరీ పండిట్ కుటుంబాల వాళ్లు జమ్ముకు తరలిపోయారని హోంశాఖ రాజ్యసభలో వెల్లడించింది. ఆ కుటుంబాలన్నీ ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలని తెలిపింది. విద్యాసంస్థలకు శీతాకాల సెలవుల నేపథ్యంలో ప్రతి ఏటా కశ్మీరీలు జమ్ముకు వెళ్తుంటారని పేర్కొన్నది.