BJP on Nitish Kumar | బీహార్ సీఎం నితీశ్కుమార్పై బీజేపీ మండిపడింది. బీజేపీ సారధ్యంలోని ఎన్డీఏ కూటమి నుంచి వైదొలిగి ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో పొత్తు పెట్టుకోవడం ప్రజాతీర్పునకు ద్రోహం చేయడమేనని ఆరోపించింది. ఎన్డీఏ నుంచి వైదొలిగిన నితీశ్ కుమార్.. బీహార్ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని గవర్నర్ను నితీశ్కుమార్ కోరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ బీహార్ శాఖ అధ్యక్షుడు సంజయ్ జైశ్వాల్ స్పందించారు.
`మేం 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కింద కలిసి పోటీ చేశాం. జేడీయూ, బీజేపీలకు అనుకూలంగా ప్రజా తీర్పు వచ్చింది. మేం అధిక సీట్లు గెలుచుకున్నా నితీశ్కుమార్ను సీఎంను చేశాం. ఈరోజు జరిగిన పరిణామాలు బీహార్ ప్రజలకు, బీజేపీకి ద్రోహం చేయడమే` అని ఏఎన్ఐ వార్తా సంస్థతో సంజయ్ జైశ్వాల్ చెప్పారు.
బీహార్ సీఎంగా రాజీనామా లేఖను గవర్నర్కు సమర్పించిన తర్వాత నితీశ్కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి నుంచి వైదొలగాలన్న అంశంపై తమ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల్లో ఏకాభిప్రాయం కుదిరిందన్నారు. పార్టీ నేతల నిర్ణయం మేరకు సీఎం పదవికి రాజీనామా సమర్పించానని నితీశ్ కుమార్ చెప్పారు.