న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి ముగింపు దగ్గర పడిందని కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్ష్వర్ధన్, ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ చేసిన ప్రకటనల పట్ల భారతీయ వైద్యుల సంఘం (ఐఎంఏ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కరోనా విషయంలో తప్పుడు సమాచారం ఇవ్వకండి అంటూ ఇటు ప్రభుత్వాన్ని, అటు రాజకీయ నాయకులను హెచ్చరించింది.
మహమ్మారి స్థితిపై రాజకీయ కారిడార్లలో చర్య జరుగుతుండటం బాధాకరమని, అయితే దీనిని ప్రపంచ ఆరోగ్య సంస్థ లేదా ఐసీఎమ్మార్ మాత్రమే శాస్త్రీయ ఆధారాల ద్వారా ధృవీకరించాలి అని ఐఎంఏ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.
కొవిడ్-19 కు 740 మంది ఫ్రంట్లైన్ కార్మికుల మరణాలను ఎత్తిచూపిన ఐఎంఏ.. మాస్కులు ధరించడం, శారీరకంగా నిర్ణీత దూరం పాటించడం గురించి పౌరులంతా అప్రమత్తంగా ఉండాలని ఐఎంఏ విజ్ఞప్తి చేసింది. గత వారంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కేసుల సంఖ్య 35 నుంచి 40 శాతం పెరిగిందని, దేశ రాజధానిలో కూడా రోజువారీ సగటు 100 నుంచి 140 మంది రోగులకు సంఖ్య పెరిగిందని ఐఎంఏ తెలిపింది. “అనధికార రాజకీయ ప్రకటనల” గురించి హెచ్చరిస్తూ “మనకు మనంగా ప్రగల్భాలు పలుకడం లేదా గొప్పలు చెప్పడం మానుకుందాం” అని అసోసియేషన్ సూచించింది.
కరోనా వైరస్ మహమ్మారి చివరి దశలో ఉన్నదని ఆదివారం నాడు కేంద్ర ఆరోగ్య మంత్రి హర్ష్వర్ధన్ చెప్పగా.. దేశ రాజధానిలో మహమ్మారి తుది దశకు చేరుకున్నదని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ అన్నారు. వీరి మాటలతో ఆగ్రహం వ్యక్తం చేసిన భారతీయ వైద్యుల సంఘం ఈ మేరకు ఈ ప్రకటన జారీ చేసింది.