హైదరాబాద్ : నగరంలో హత్యలకు పాల్పడుతున్న దంపతులను పోలీసులు అరెస్టు చేశారు. బాలానగర్ డీసీపీ పద్మజ బుధవారం నిందితులను మీడియా ఎదుట హాజరుపరిచారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. బొల్లారానికి చెందిన స్వామి, నర్సమ్మ అనే దంపతులు కూలీ పనులను ఇప్పిస్తామంటూ నమ్మబలికి హత్యలకు పాల్పడుతున్నారు. అనంతరం వారి నుంచి ఆభరణాలు, నగదు దోచుకెళ్తున్నారు. ఈ నెల 25న మల్లాపూర్లో మహిళా కూలీ అదృశ్యమైంది. నిందితులిద్దరూ సదరు మహిళా కూలీకి పని కల్పిస్తామని తీసుకెళ్లి హత్య చేశారు. ఆ తర్వాత ఆమె వద్ద ఉన్న బంగారు నగలు, ఫోన్ ఎత్తుకు వెళ్లారు. హత్యపై కేసుపై దర్యాప్తు చేస్తున్న క్రమంలో సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించినట్లు డీసీపీ తెలిపారు. ఇప్పటి వరకు ఇద్దరు కలిసి నలుగురిని హత్య చేసినట్లు అంగీకరించారన్నారు. నిందితులను కస్టడీలోకి తీసుకొని విచారించనున్నట్లు వివరించారు.