ఇటానగర్ : అరుణాచల్ప్రదేశ్లోని ఎగువ సియాంగ్ జిల్లాలో బుధవారం ఆర్మీ వాహనం ప్రమాదవశాత్తు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఓ జవాన్ మృతి చెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆ వాహనంలో 11 మంది ఉండగా.. మిగింగో ట్రాన్సిట్ క్యాంప్ నుంచి ట్యూటింగ్ క్యాంప్కు వెళ్తుండగా ఘటన చోటు చేసుకుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. కొండ ప్రాంతంలోని రహదారిపై వెళ్తుండగా పాంగో – ట్యూటింగ్ మధ్య లోయలో పడిపోయిందని ట్యూటింగ్ అదనపు డిప్యూటీ కమిషనర్ (ఏడీసీ) స్టార్లీ జామోహ్ తెలిపారు.
ప్రమాదంలో నాల్గో సిక్కు లైట్ పదాతిదళ రిజిమెంట్కు చెందిన జవాన్ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారని, వారిని వెంటనే ఆర్మీ ఛాపర్ ద్వారా ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. నలుగురిలో ఒకరిని అసోంలోని టిన్సుకియా జిల్లాలోని దింజన్ ఆర్మీ బేస్ ఆసుపత్రిలో చేర్పించగా.. మిగతా ముగ్గురిని గువాహటి ఆర్మీ బేస్ దవాఖానకు తరలించినట్లు చెప్పారు. ఆరుగురు జవాన్లకు స్వల్పంగా గాయాలయ్యాయని, రోడ్డు మార్గంలో వారిని ట్యూటింగ్కు పంపినట్లు తెలిపారు.