మహాబలిపురం: ప్రతిష్ఠాత్మక చెస్ ఒలింపియాడ్లో భారత-‘ఎ’ మహిళల జట్టు తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ బుధవారం మూడో సీడ్ జార్జియాపై ఘన విజయం సాధించింది. జట్టు విజయంలో కోనేరు హంపి, ఆర్.వైశాలి ముఖ్యపాత్ర పోషించారు. హంపి, వైశాలి విజయాలు నమోదు చేయగా, తానియా సచ్దేవ్, ద్రోణవల్లి హారిక తమ మ్యాచ్లను డ్రాగా ముగించడంలో భారత-‘ఎ’ జట్టు 3-1 తేడాతో జార్జియాను ఓడించింది. తన కంటే మెరుగైన ర్యాంకింగ్ క్రీడాకారిణి ననా జగ్నిద్జెతో జరిగిన పోరులో ఆట మధ్యలోనే హంపి పట్టు సాధించింది. ప్రత్యర్థికి ఎటువంటి అవకాశమివ్వకుండా తన పావులను చురుకుగా కదుపుతూ ఆటపై పట్టు బిగించింది. 44వ ఎత్తులో ననా ఓటమిని అంగీకరించడంతో హంపి జట్టుకు తొలి విజయం అందించింది. స్పానిష్ ఓపెనింగ్తో సాగిన మరో మ్యాచ్లో వైష్ణవి 36 ఎత్తులలో లెలా జవకిస్విలిని ఓడించింది. ఆరంభం నుంచి వైష్ణవి దూకుడుగా ఆడి ఆధిపత్యం ప్రదర్శించింది. 17వ ఎత్తులో రెండు ప్రత్యర్థి పావులను బలిగొని ఆటపై పట్టు సాధించింది. దీనితో 36వ ఎత్తులో జవకిస్విలి ఓటమిని అంగీకరించింది. ఈ విజయంతో భారత్-‘ఏ’ ఆరు విజయాలతో 12 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది.