హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): ఆర్బిట్రేషన్ అవార్డు ప్రకటించిన తర్వా త కోర్టుల నుంచి స్టే ఉత్తర్వులు పొందుతున్నారని, ఇలాంటి కేసులను విచారించేందుకు కమర్షియల్ కోర్టులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు పేర్కొన్నారు. కమర్షియల్ కోర్టులకు ఇతర పనులను తగ్గించి ఆర్బిట్రేషన్ అవార్డులను సవాల్ చేసిన కేసులనే అగ్పించాలన్నారు. ఆర్బిట్రేషన్ కేసుల విచారణకు హైకోర్టులో కూడా ప్రత్యేక ధర్మాసనం ఉంటే మంచి ఫలితాలు వస్తాయని అభిప్రాయపడ్డారు.
‘సులభ వ్యాపారంలో ప్రత్యామ్నాయ పరిషార వేదిక ప్రాముఖ్యత’ అనే అంశంపై శనివారం హైదరాబాద్లోని అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ), ఫికీ ఆధర్యంలో జరిగిన సదస్సుకు జస్టిస్ లావు నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆర్బిట్రేషన్లో వెలువడే తీర్పులపై వివాదం తలెత్తినప్పుడు కోర్టులను ఆశ్రయించకుండా మధ్యవర్తిత్వ మార్గాన్ని ఎంచుకొంటే మంచి ఫలితాలు ఉంటాయన్నారు.
సంస్థాగత ఆర్బిట్రేషన్ ద్వారా కేసులను పరిష్కరించుకోవడం వల్ల అధిక లాభాలు ఉంటాయని, విదేశాల్లో 80 శాతానికిపైగా కక్షిదారులు సంస్థాగత ఆర్బిట్రేషన్కే మొగ్గు చూపుతారని పేర్కొన్నారు. ఐఏఎంసీ ద్వారా వివాదాలను పరిష్కరించుకోవాలని కంపెనీలకు, వాణిజ్య సంస్థలకు ఆయన పిలుపునిచ్చారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ మాట్లాడుతూ.. కేసుల పరిష్కారంలో ఆర్బిట్రేషన్కు పెద్దపీట వేయాల్సిన అవసరం ఉన్నదన్నారు. గతంలో మాజీ న్యాయమూర్తులు ఆర్బిట్రేటర్లుగా ఉండేవారని, ఇప్పుడు శిక్షణ నిపుణులు ఆర్బిట్రేటర్లుగా రావడం స్వాగతనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఐఏఎంసీ సీఈవో సితేశ్ ముఖర్జీ, రిజిస్ట్రార్ తారిఖ్ ఖాన్, ఫికీ చైర్మన్ మురళీధరన్, మాజీ చైర్మ న్ మురళీకృష్ణారెడ్డి పాల్గొన్నారు.