ఎన్టీఆర్ జిల్లా : రాష్ట్ర వ్యాప్తంగా చెత్త వాహనాల ఉపయోగించే ఒప్పందం వెనుక పెద్ద కుంభకోణం దాగి ఉన్నదని ఆంధ్రప్రదేవ్ అర్బన్ సిటిజన్స్ ఫెడరేషన్ (ఏపీయూసీఎఫ్) సమాఖ్య ఆరోపించింది. జగనన్న స్వచ్చ సంకల్పం కార్యక్రమాన్ని ‘జగనన్న చెత్త సంకల్పం’ అని అభివర్ణించింది. క్లీన్ ఏపీ పథకం పేరుతో ప్రభుత్వం పౌరుల జేబులను శుభ్రం చేస్తున్నదని సమాఖ్య కన్వీనర్ సీహెచ్ బాబూరావు ఆరోపించారు. ఆస్తిపన్నులో చెత్తపన్నును చేర్చినప్పుడు మళ్లీ చెత్తపన్ను ఎలా వసూలు చేస్తారని ప్రశ్నించారు. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం, దీనికి చట్టపరమైన అనుమతి లేదని విజయవాడలోని బాలోత్సవ్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. చెత్త పన్ను వసూళ్లను తీవ్రంగా తప్పుబట్టిన ఆయన.. ఈ కొత్త పన్నుతో ప్రజలపై రూ.500 కోట్ల భారం వేసేందుకు కుట్రపన్నారని దుయ్యబట్టారు.
స్వచ్ఛ భారత్ ముసుగులో కేంద్ర ప్రభుత్వం పారిశుధ్య పనులను కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తున్నదని, కేంద్రం ఒత్తిడి వల్లనే రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై భారం మోపిందని బాబూరావు విమర్శించారు. మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ల ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వకుండానే చెత్త వాహనాలను వినియోగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నదని ఆరోపించారు. ఒక్కో చెత్త వాహనాలకు స్థానిక సంస్థలు రూ.63 వేలు చెల్లించాల్సిన ఒప్పందం వెనుక భారీ కుంభకోణం జరిగినట్లు అనుమానిస్తున్నామన్నారు. కార్పొరేట్ సంస్థలకు ఏడాదికి రూ.600 కోట్లు చెల్లించాలన్న ఒప్పందంలో పారదర్శకత లేదని ఆయన పేర్కొన్నారు. పుణెకు చెందిన స్వయంభూ ట్రాన్స్పోర్ట్ కంపెనీతో ఈ ఒప్పందం కుదిరినట్లుగా సమాచారం ఉన్నదని ఆయన చెప్పారు.
పారిశుధ్యం, ప్రజారోగ్యం పరిరక్షించాల్సిన బాధ్యత స్థానిక సంస్థలు, ప్రభుత్వంపై ఉన్నదని ఏపీ యూసీఎఫ్ కన్వీనర్ బాబురావు అన్నారు. ప్రజాభిప్రాయం తీసుకోకుండా చెత్త పన్ను వసూలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. చెత్త పన్నుపై హైకోర్టులో ఇప్పటికే అనేక పిటిషన్లు దాఖలయ్యాయని, న్యాయవ్యవస్థ ఇంకా నిర్ణయం తీసుకోనప్పుడు పన్ను వసూలు చేయడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని గుర్తు చేశారు. ఈ విషయంపై మున్సిపల్ శాఖ మంత్రి వివరణ ఇవ్వాలని, ప్రజలకు మంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చెత్త పన్నుకు వ్యతిరేకంగా ప్రజా సంఘాలు కూడా ఆందోళనకు దిగాలని బాబూరావు పిలుపునిచ్చారు.