‘బడ్జెట్ ఎంత, హీరోలెవరూ అనే విషయాల కంటే సినిమా చక్కటి ఎక్స్పీరియన్స్ను పంచడం ముఖ్యం. అనుభూతి పరంగా చూస్తే ఇది చాలా పెద్ద సినిమా అవుతుంది’ అని అన్నారు హీరో నిఖిల్. రంజిత్, షెర్రీ అగర్వాల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఏప్రిల్ 28 ఏం జరిగింది’. వీజీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై వీరాస్వామి.జి స్వీయ దర్శకత్వంలో రూపొందించారు. ఈ నెల 27న విడుదలకానుంది. మంగళవారం హైదరాబాద్లో ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి హీరో నిఖిల్, బిగ్బాస్-4 ఫేమ్ సయ్యద్ సొహెల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నిఖిల్ మాట్లాడుతూ ‘ ఎలాంటి అంచనాలు లేకుండా నేను ఈ సినిమా చూశా. బాగా నచ్చింది. మంచి సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడం బాధ్యతగా భావించి ప్రోత్సహించడానికి ముందుకొచ్చా’ అని అన్నారు. అశ్లీలత, ద్వంద్వర్థాలకు తావు లేకుండా కుటుంబమంతా కలిసిచూసేలా ఉంటుందని సయ్యద్ సొహెల్ తెలిపారు. హీరో రంజిత్ మాట్లాడుతూ ‘ఏప్రిల్ 28న అడవిరాముడు, యమలీల, బాహుబలి, పోకిరి లాంటి గొప్ప సినిమాలు విడుదలయ్యాయని హాస్యనటుడు అలీ ఓ సందర్భంలో చెప్పారు. అలాంటి మంచి రోజును టైటిల్గా ఎంచుకొని రూపొందించిన చిత్రమిది’ అని చెప్పారు. చిత్ర దర్శకుడు వీరాస్వామి మాట్లాడుతూ ‘ ధర్మతేజ సాహిత్యం, సందీప్ సంగీతం, భాను నృత్యాలు, రంజిత్, రాజీవ్ కనకాల, అజయ్ అభినయం ఈ చిత్రానికి ప్రధానాకర్షణగా నిలుస్తాయి’ పేర్కొన్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన చిత్రమిదని, ఓ ఇంటి నేపథ్యంలో విభిన్నంగా సాగుతుందని హరిప్రసాద్ జక్కా తెలిపారు.