కలెక్టరేట్, నవంబర్ 25: నగర శివారులోని హౌసింగ్బోర్డుకాలనీ సమీపం నుంచి సదాశివపల్లికి మానేరు వాగుపై నిర్మిస్తున్న కేబుల్ బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. రహదారులు, భవనాల శాఖ అధికారులు, గుత్తేదారులతో కలిసి శుక్రవారం ఆయన రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, నిర్దేశించిన గడువులోగా అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయాలని, ఇందుకోసం అదనపు కూలీలను రప్పించి రేయింబవళ్లు పనులు కొనసాగించాలని సూచించారు. త్వరగా పనులు పూర్తయ్యేలా అధికారులు నిత్యం పనులను పర్యవేక్షించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్ అండ్ బీ ఈఈ సాంబశివరావు, తహసీల్దార్ సుధాకర్, ఏఈలు, గుత్తేదారు జమాలొద్దీన్, తదితరులు పాల్గొన్నారు.
ఓటరు జాబితా ప్రత్యేక సవరణలో భాగంగా ఈనెల 26, 27, డిసెంబర్ 3, 4వ తేదీల్లో ఓటరు నమోదు ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఒక ప్రకటనలో తెలిపారు. 18 ఏళ్లు నిండిన వారంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, ఓటరుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. బూత్ స్థాయి అధికారులు ఉదయం పది గంటలకే విధిగా పోలింగ్ కేంద్రానికి రావాలని ఆదేశించారు. జనవరి 1, 2023 నాటికి 18 ఏళ్లు నిండే యువతీయువకులు గరుడ యాప్ లేదా ఫాం 6 ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. బీఎల్వోలు కూడా ఇంటింటికీ తిరిగి 18 ఏళ్లు నిండిన వారిని గుర్తించి చైతన్యవంతం చేయాలన్నారు. ట్రాన్స్జెండర్లు కూడా ఓటు నమోదు చేసుకునేలా ప్రోత్సహించాలని పేర్కొన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్ రేఖాంశాలు, అక్షాంశాలు విధిగా పట్టుకోవాలని ఆదేశించారు. ప్రతి సూపర్వైజర్ వారి పరిధిలో కనీసం పది శాతం పోలింగ్ కేంద్రాలను సందర్శించి ధ్రువీకరణ పత్రం సమర్పించాలని, ఈఆర్వో వారి పరిధిలోని పది పోలింగ్ కేంద్రాలను సందర్శించి అన్ని అంశాలు పరిశీలించాలని సూచించారు. అర్హుల పేర్లు నమోదైనది లేనిది పరిశీలించి, జిల్లా ఎన్నికల అధికారికి నివేదిక సమర్పించాలని ఆదేశించారు.