హైదరాబాద్ : అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలకు ఒక్క రోజు భారత బ్రిటిష్ హై కమిషనర్గా వ్యవహరించే అవకాశాన్ని బ్రిటిష్ హై కమిషనర్ ఇవ్వనుంది. దేశవ్యాప్తంగా 18-23 సంవత్సరాల వయసున్న మహిళలు ఎవరైనా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ‘వాతావరణ మార్పుల సమస్యను ఎదుర్కొనేందుకు యువత ఎలా మద్దతు ఇస్తుంది’ అనే అంశంపై ఒక్క నిమిషం నిడివితో కూడిన వీడియోను ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో #DayoftheGirl యాష్ట్యాగ్తో @UKinIndiaను ట్యాగ్ చేస్తూ అప్లోడ్ చేయాలని సూచించింది. ఈ నెల 22లోగా ప్రక్రయను పూర్తి చేయాల్సి ఉంటుందని బ్రిటిష్ హై కమిషనర్ ఆఫ్ ఇండియా అలెక్స్ ఎల్లిస్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొవిడ్-19 ప్రపంచవ్యాప్తంగా బాలికల విద్యపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిందన్నారు. అందుకే యూకే నిర్వహించిన జీ7 దేశాల సదస్సులో ఆడపిల్లలను పాఠశాలల్లో చేర్పించడంపై దృష్టి పెట్టాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. అందుకే యూకే ఈ ఏడాది ఇండియాకు ఇచ్చే ఫెలోషిప్లలో 60శాతం, స్కాలర్షిప్లలో 52శాతం మహిళలకు ఇవ్వాలని నిర్ణయించిందన్నారు. సమానత్వ ప్రపంచాన్ని నిర్మించేందుకు ఆడపిల్లలను చదివించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది ఇండియాలోని ఎవరైనా ఒక యువ మహిళకు బ్రిటిష్ హైకమిషనర్ అయ్యే అవకాశం ఇచ్చి, మహిళలు తలచుకుంటే ఏదైనా సాధించగలరని నిరూపించాలనుకుంటున్నామన్నారు. 2017 నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.