న్యూఢిల్లీ: యాపిల్ ఐఫోన్ వినియోగదారులకు శుభవార్త. మరొకొద్దిరోజుల్లో మేడిన్ ఇండియా ఐఫోన్ 12 స్మార్ట్ఫోన్ అందుబాటులోకి రానుంది. దేశీయంగా ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీని కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోన్న విషయం తెలిసిందే. తన ఫ్లాగ్షిప్, పర్యావరణహిత ఐఫోన్ 12 స్మార్ట్ఫోన్ను స్థానిక వినియోగదారుల కోసం భారతదేశంలో ఉత్పత్తి చేయనున్నట్లు యాపిల్ మంగళవారం ప్రకటించింది. భారత్లో ఐఫోన్ 12 సిరీస్కు విశేషస్పందన వస్తున్న సమయంలో యాపిల్ ఈ ప్రకటన చేయడం విశేషం.
‘మా స్థానిక వినియోగదారుల కోసం భారత్లో ఐఫోన్ 12 ఫోన్ల తయారీని ప్రారంభించబోతున్నందుకు చాలా గర్వంగా ఉంది. కస్టమర్ల సంతోషం కోసం ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమైన ఉత్పత్తులు, సేవలు అందించేందుకు యాపిల్ కట్టుబడి ఉందని’ కంపెనీ పేర్కొంది. ఐఫోన్ 12 5G టెక్నాలజీతో వస్తోంది.
100శాతం రీసైకిల్ చేసిన ఉపకరణాలతో ఈ ఫోన్ను తయారు చేస్తున్నారు. ఐఫోన్ ఎస్ఈ మోడల్ ద్వారా యాపిల్ 2017 నుంచి భారత్లో ఐఫోన్లను ఉత్పత్తి చేస్తోంది. ఇప్పటికే అడ్వాన్స్డ్ మోడళ్లైన ఎక్స్ఆర్, ఐఫోన్ 11ను తయారు చేస్తున్న కంపెనీ ఇప్పుడు ఐఫోన్ 12ను ఉత్పత్తి చేయబోతోంది.