టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్ ఝలక్ ఇచ్చింది. ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మను అగౌరపరిచారని సమన్లు జారీ చేసింది. టీడీపీ సీనియర్ నేత బోండా ఉమకు కూడా సమన్లు జారీ చేసింది. ఈ నెల 27న రాష్ట్ర మహిళా కమిషన్ ముందుకు రావాలని ఆదేశించారు.
విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో అత్యాచార బాధితురాలిని పరామర్శించే సమయంలో చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మను అగౌరవ పరిచారని, బాధితురాలి ఆవేదనను ఏమాత్రం విననీయకుండా బాబు అడ్డుకున్నారని, దీంతో పాటు బాధితురాలు భయపడేలా చేశారన్నది అభియోగం. ఈ కారణాల రీత్యా చంద్రబాబు, బోండా ఉమ.. ఇద్దరూ వ్యక్తిగతంగా మహిళా కమిషన్ ఎదుట హాజరు కావాలని సమన్లలో పేర్కొంది.
అసలేం జరిగిందంటే….
విజయవాడలో ఓ మానసిక వికలాంగురాలైన యువతిపై ముగ్గురు కామాంధులు అత్యాచారం చేశారు. ఏకంగా ఓ ప్రభుత్వాసుపత్రిలోనే ఇలా జరగడం ఏపీలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఘటనను అన్ని రాజకీయ పక్షాలూ ఖండించాయి. ఇక.. అత్యాచార బాధితురాలిని పరామర్శించేందుకు అన్ని రాజకీయ పార్టీల నేతలు వస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా బాధితురాలిని పరామర్శించేందుకు ఆస్పత్రికి వచ్చారు. ఈ క్రమంలో ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఎదురుపడ్డారు. ఈ క్రమంలో వీరిద్దరికీ వాగ్వాదం జరిగింది. ఈ ఘటనే చంద్రబాబుకు సమన్లు ఇచ్చే వరకూ వెళ్లింది.