హైదరాబాద్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ): టీడీపీ మాటలతో చూపిస్తే.. వైసీపీ చేతలతో చూపిస్తున్నది. దాడులతో, ప్రతిదాడులతో ఏపీ రాజకీయ రణరంగమవుతున్నది. సమైక్య రాగాలు తీసినవాళ్లు తమలో తామే కీచులాడుకుంటున్నారు. అరెస్టులు, ధర్నాలతో అట్టుడుకుతున్న ఏపీపై అక్కడి ప్రజలే ముక్కు విరుస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అంధకారమే అన్నవాళ్లు అరాచకంలో మునిగిపోతున్నారు. విడిపోతే తెలంగాణ పడిపోతుందని అన్నవాళ్లు కలబడి కత్తులు దూసుకుంటున్నారు. గత రెండు రోజులుగా ఏపీలోని డ్రామాలు, పొలిటికల్ ట్రిక్కులు. తిట్ల దండకాలు.. రోడ్లమీదికెక్కడాలు చూసి ఆంధ్రప్రదేశ్ ప్రజలే ఏవగించుకుంటున్నారు. తమ నేతల తీరు చూసి ఇదేం సంస్కారమని ప్రశ్నిస్తున్నారు. ఒకప్పుడు మన నుంచి విడిపోయిన తెలంగాణ ఎంత గొప్పగా ఉన్నదో అని ఒకరు గుర్తు చేసుకుంటే.. అభివృద్ధిని పట్టాలపై పరుగులు పెట్టించిన తెలంగాణ ఎక్కడ? అవహేళనలతో రోడ్డెక్కుతున్న ఏపీ రాజకీయాలెక్కడ? అని మరికొందరు సామాజిక మాధ్యమాల్లో చర్చించుకుంటున్నారు. కొందరు ఏపీ నేతలు హద్దులుదాటి మాట్లాడడాన్ని అక్కడి ప్రజలే అసహ్యించుకుంటున్నారు. గత రెండు రోజులుగా ఏపీలో జరుగుతున్న పరిణామాలను చూసి నాయకులకు ఇది భావ్యంకాదని, పక్కనున్న తెలంగాణను చూసి నేర్చుకోవాలని సూచిస్తున్నారు. తెలంగాణ ప్రజలకు పరిపాలించడం రాదని వేలెత్తిచూపిన ఏపీలో పరిపాలనను, ప్రజా సమస్యలను గాలికొదిలేసి రాసులాడుకోవడం అవసరమా? అని అక్కడివారంటున్నారు.
‘దళితబంధు పథకం తానే ప్రకటించి ఆ క్రెడిట్ను తానే కొట్టేయవచ్చు. కానీ సీఎం కేసీఆర్ అలా చేయలేదు. అందరినీ విశ్వాసంలోకి తీసుకుని, ప్రతిపక్ష పార్టీలను పిలిచి, పథకం గురించి వివరించారు. ప్రతిపక్ష పార్టీల నేతలు సైతం అఖిలపక్ష సమావేశానికి హాజరై విజ్ఞత ప్రదర్శించారు. ఇలాంటి రాజకీయాలు శ్రేయస్కరం. కానీ దిగజారడం, మంచిదికాదు. రాజకీయాల్లో భాష ముఖ్యం. రాజకీయ నేతలు మాట్లాడే భాష మరీ ముఖ్యం’ అని నెల్లూరుకు చెందిన మునీర్ అహ్మద్ షేక్ అభిప్రాయపడ్డారు.
పట్టాభి అరెస్టు, నారా లోకేశ్పై కేసు
నేడు దీక్షకు దిగనున్న చంద్రబాబు
అమరావతి: ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య ఉద్రిక్తతలు బుధవారం వరుసగా రెండోరోజూ కొనసాగాయి. టీడీపీ కార్యాలయాలపై దాడిని నిరసిస్తూ ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ధర్నాలు చేపట్టారు. మంగళవారం నాటి దాడిలో గాయపడిన టీడీపీ కార్యకర్తలను అంబులెన్సులో పార్టీ కార్యాలయానికి తరలిస్తుంటే పోలీసులు అడ్డుకున్నారు. టీడీపీ నేత లోకేశ్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఆయనపై కేసు నమోదు చేశారు. ఏపీ సీఎం జగన్పై తీవ్ర ఆరోపణలు చేసిన టీడీపీ నేత పట్టాభిని పోలీసులు అరెస్టు చేశారు. టీడీపీ కార్యాలయాలపై దాడికి నిరసనగా 36 గంటల దీక్ష చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం రాత్రి 8 గంటల వరకు ఆయన మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో.. ధ్వంసమైన సామాగ్రి మధ్య దీక్ష చేపట్టనున్నట్లు పార్టీవర్గాలు తెలిపాయి. శనివారం ఢిల్లీ వెళ్లి కేంద్రానికి ఆయన ఫిర్యాదు చేస్తారని వివరించాయి.