అమరావతి : ఏపీలో సినిమా టికెట్ల వివాదాన్ని త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి పేర్ని నాని తెలిపారు. మంగళవారం ఏపీ సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడమే ప్రతిపక్షం టీడీపీ పనిగా పెట్టుకుందని విమర్శించారు. ప్రభుత్వం టిక్కెట్ల వ్యాపారం చేస్తుందని చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఆన్లైన్లో టికెట్ల అమ్మకం జరగాలని స్పష్టం చేశారు.
ప్రజలకు మంచి చెయ్యడం కోసమే ప్రభుత్వం ఈ ఆలోచన చేసిందన్నారు. ఆన్లైన్లో టికెట్లు అమ్మవచ్చని గత ప్రభుత్వమే నిర్ణయించిందని, ఆ నిర్ణయానికి తెలుగు ఫిలిం చాంబర్ కూడా అంగీకారం తెలిపిందని గుర్తు చేశారు. సినిమా పరిశ్రమ పెద్దలు సీఎం జగన్తో సమావేశమవుతామని కోరారని, ఆగస్ట్లో భేటీ కావాలని భావించినా కుదరలేదన్నారు. త్వరలోనే సినీ ప్రముఖులు సీఎం జగన్ ను కలుస్తారని వివరించారు.