అమరావతి : త్వరలోనే ఆన్లైన్ టికెటింగ్ వ్యవస్థ ద్వారా ప్రజలకు వినోదాన్ని అందించనున్నట్లు ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. సోమవారం ఏపీ ప్రభుత్వంతో సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, థియేటర్ యజమానులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఈ సందర్భంగా ఆన్లైన్ టికెట్ల వ్యవహారంపై సమావేశంలో చర్చ జరిగింది. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. చిరంజీవి అంటే సీఎం జగన్కు గౌరవం ఉందన్నారు. ప్రజలకు మేలు చేసేలా ఎవరు ఏ విన్నపం చేసినా జగన్మోహన్రెడ్డి సర్కారు ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందన్నారు.
ప్రభుత్వం నిర్ణయించిన రేట్లపై సమావేశంలో సినీ పెద్దలకు వివరించినట్లు చెప్పారు. టికెట్ల ధరలపై ప్రజలెవరూ ప్రశ్నించే అవకాశం లేకుండా పారదర్శకతతో కూడిన రేట్లను అమలు చేస్తామన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలను మాత్రమే థియేటర్లలో అమలు చేయాలని, అందుకు ఆన్లైన్ వ్యవస్థ ద్వారా వినోదాన్ని అందించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి అన్ని వర్గాల నుంచి సానుకూల స్పందన వచ్చిందన్నారు. సమావేశంలో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల అభిప్రాయాలను తీసుకోవడంతో పాటు సమస్యలనూ గుర్తించినట్లు చెప్పారు. చిత్ర నిర్మాణంలో నిర్మాతలు కోరే వసతులు తెలుసుకున్నామని, సాధ్యమైనంత వరకు సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు.
అనంతరం నిర్మాత సీ కల్యాణ్ మాట్లాడుతూ సినీ పరిశ్రమకు ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. ఆన్లైన్ టికెటింగ్ కావాలని మేమే అడిగామన్నారు. తెలుగు సినీ పరిశ్రమ సంతోషంగా ఉందన్నారు. గతంలో ఆన్లైన్ టికెటింగ్ వ్యవస్థ ఆప్షన్గా ఉండేదని, ప్రస్తుతం తప్పనిసరి చేయాలని మేమే కోరామని మరో నిర్మాత ఆదిశేషగిరిరావు పేర్కొన్నారు. సినీ పరిశ్రమకు మేలు చేయడంతో పాటు థియేటర్ యజమానుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారన్నారు.
మరోసారి సినీ ప్రముఖులతో సమావేశమై, సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారన్నారు. సమావేశం సానుకూల వాతావరణంలో జరిగిందని నిర్మాత ఎన్వీ ప్రసాద్ అన్నారు. బుక్ మై షో తరహాలోనే టికెట్లు కొంటారన్నారు. రాష్ట్రంలో సినిమా షూటింగ్లు పెరిగాయన్నారు. నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ రేపటి నుంచి థియేటర్లను ప్రభుత్వానికి అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అయితే, పండుగ వేళల్లో బస్సుల్లో అధిక చార్జీలు వసూలు చేస్తున్నారని, అలాగే థియేటర్లలో అధికంగా వసూలు చేస్తే తప్పేంటని నిర్మాతలు ప్రశ్నించారు.