అమరావతి : ప్రజా సంక్షేమమే పరమావధిగా సేవలందించాల్సిన ప్రజాప్రతినిధులే దారితప్పి ప్రవరిస్తుండ డం పలు విమర్శలకు దారితీస్తుంది. ఏపీకి చెందిన మంత్రి ఒకరు తిరుమల కొండపై ప్రవర్తించిన తీరుపై భక్తులు తీవ్రంగా మండి పడుతున్నారు. రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషా శ్రీచరణ్ ఇవాళ తిరుమలలో హల్చల్ చేశారు. వేసవి సెలవుల కారణంగా శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు.
దీంతో టీటీడీ ముందు జాగ్రత్తగా ప్రత్యేక దర్శనాలను రద్దు చేసింది. దివ్యాంగులు, పిల్లలు, వృద్ధుల దర్శనాలతో పాటు వీఐపీ దర్శనాలను, సిఫార్సు లేఖలపై దర్శనాలు సైతం రద్దు చేయడంతో మంత్రి ఉషాచరణ్ స్వయంగా రంగంలోకి దిగి 50 మంది అనుచరులతో దర్శనం చేసుకోవడం విమర్శలకు దారితీసింది. మరో 10 మందికి సుప్రభాత సేవా టికెట్లు పొంది వారికి దర్శనభాగ్యం కల్పించడాన్ని ప్రశ్నించిన మీడియాపై ఆమె గన్మెన్లు దురుసుగా ప్రవర్తించడం సంచలనం కలిగించింది.
ఇప్పటికే రెండురోజులుగా స్వామివారి దర్శనం కోసం పడిగాపులు కాస్తున్న భక్తులను కాదని హోదా పేరుతో అధికారాన్ని దుర్వినియోగం చేయడం పట్ల భక్తులు మండిపడుతున్నారు.