తెలంగాణ విషయంలో మొదటినుంచీ వలసవాద మీడియా అబద్ధాలు, అసత్యాలనే వండివార్చింది. అలాంటి ఆంధ్రా మీడియా పీవీ నరసింహారావును అసమర్థునిగా, చెన్నారెడ్డి వంటివారిని అవినీతిపరుడిగా ప్రచారం చేసింది. అంతటితో ఆగకుండా అంజయ్య వంటి మానవతావాదిని జోకర్గా వర్ణించింది. ఇక చరిత్ర, కళా సాహిత్య సాంస్కృతిక రంగాలను అవహేళన చేయటమే కాదు, వివక్షతో అణచివేసింది.
తెలంగాణపై మొదటినుంచీ విషం గక్కుతున్న పరాయి మీడియా స్వయం పాలనలో తీరు మార్చుకోలేదు. ఇంకా అక్కసుతో విషపు శీర్షికలకే జీవం పోస్తున్నది. రాష్ట్రం ఏర్పడిన తొలి రోజు నుంచే అలవాటుగా విషపు రాతలు, వ్యంగ్య వ్యాఖ్యానాలు చేస్తున్నది. ఈ ప్రాంత ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు లక్ష్యంగా తప్పుడు వార్తలు రాస్తున్నది.
తెలంగాణ అంటే అరవై ఎండ్ల పోరాట ఫలం. అమరుల స్వప్నం. వివక్ష అణచివేతలను, ఆధిపత్యాన్ని నేలకూల్చిన విజయపతాకం. మహోన్నత పోరాటంతో సాధించుకున్న తెలంగాణ, స్వీయపాలన అందిస్తున్న ఉద్యమనేతల గురించి వ్యంగ్య కథనాలు రాయడం, అబద్ధాలు, అర్ధ సత్యాలను నిజాలుగా నమ్మిం చే ప్రయత్నం చేయడం గర్హనీయం.
స్వరాష్ట్రంలో మా పాలనను ఎక్కిరిస్తే, మా అభివృద్ధిని అవమానిస్తే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని పరాయి మీడియా గుర్తిస్తే మంచిది. నాడు ఆంధ్రా పార్టీలకు బాకాగా తెలంగాణ ఉద్యమంపై విషం గక్కినట్లే, ఇవాళ తెలంగాణలో పాలనపై పరాయి మీడియా అబద్ధపు ప్రచారం చేస్తున్నది.
ఏపీకి తెలంగాణ ఇవ్వాల్సిన బకాయిల గురించి పెద్ద హెడ్డింగులు పెడ్తున్నది. గంటల తరబడి చర్చోపచర్చలు నిర్వహిస్తున్నది. తెలంగాణకు ఏపీ ఇవ్వాల్సిన, బాకీ పడ్డ బకాయిల గురించి మాత్రం ఏ మీడియా రాయదు! ఏ మీడియా కూయదు! స్వయంపాలనలో కూడా కిరాయి, పరాయి మీడియా తెలంగాణ ప్రజలను అవమానిస్తున్నది. ఇక్కడి పాలకులు అవినీతిపరులని ముద్ర వేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నది. ఆరోపణలనే నేరాలుగా, ప్రకటనలను తీర్పులుగా కథనాలు రాయడం, చూపించడం ఇక్కడి ప్రజలను అవమానించడం కాకుంటే మరేమవుతుంది?.
ఢిల్లీ మద్యం కేసులో అబద్ధాలను, ఆధార రహిత కథనాలను ప్రచురించింది. ఎక్కడో ఢిల్లీలో జరిగిన కుంభకోణాన్ని తెలంగాణకు ఆపాదించడం, అందులో తెలంగాణ ప్రజాప్రతినిధులే కీలకంగా ఉన్నారని ప్రచారం చేయటం పాత్రికేయ నీతికే వ్యతిరేకం. బీజేపీ నేతల ఆరోపణలు సాకుగా చేసుకొని ఎమ్మెల్సీ కవిత ఆ కుంభకోణంలో భాగస్వామి అయినట్లు వక్రీకరించి రాయటం విష ప్రచారమే. అంతటితో ఆగకుండా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఇంటర్వ్యూ చేసిన తీరు ప్రజలను కించపరిచేలా సాగడం ఆక్షేపణీయం. ప్రగతిభవన్ నా గుప్పిట్లో ఉందనేలా వ్యాఖ్యానాలు చేయడం అహంకార పూరితం.
సమైక్య ఉద్యమాన్ని ఆకాశానికి ఎట్లా ఎత్తారో, తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేశారో తెలంగాణ సమాజం మరిచిపోలేదు. ‘దళితబంధు’ పథకంపై అవమానకర వ్యాఖ్యలు చేయటం తీవ్ర ఆక్షేపణీయం. రాష్ట్ర ఏర్పాటు తర్వాత స్వయంపాలనలో సబ్బండ వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ బృహత్తర పథకాలను రూపొందించి అమలుచేస్తున్నారు. అటువంటి తెలంగాణ ప్రభుత్వం, పాలనపై విషపు రాతలు రాయటం సహించరానిది. అణగారిన వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందాలనీ, మహాత్మా జ్యోతిబా పూలే చెప్పిన విద్య అందరికీ అందించాలనే ఆశయం కోసం తెలంగాణ అంతటా గురుకులాలు ఏర్పాటుచేసి విద్యాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తున్నది. దళితులకు సామాజిక, రాజకీయ, ఆర్థిక అవకాశాలతోనే అభివృద్ధి సాధ్యమవుతుందన్న అంబేద్కర్ మాటలను ఆచరణలో చూపటమే ఇవాళ తెలంగాణలో దళితబంధు పథకం అమలుచేయటం. గత ప్రభుత్వాలు దళితులను ఓటు బ్యాంకుగా చూశాయి. కానీ తెలంగాణ ప్రభుత్వం సమాజంలో వారి భాగస్వామ్యం అవసరమనీ, వారిని ఆర్థికంగా అభివృద్ధి చేయాలని ప్రయత్నిస్తూ ఉంటే, దళిత బంధు పథకంపై విద్వేషపూరిత వ్యాఖ్యానాలు చేయడం దళిత సమాజాన్ని అవమానించడమేగాక, అంబేద్కర్ అంటే గౌరవం లేని తనమే.
రాష్ట్రం చేసిన అప్పుల గురించి ప్రస్తావించి, దళిత బంధు ఎలా అమలు చేస్తారని అడగటం అవగాహనా రాహిత్యమే. ప్రభుత్వాలు ప్రజల అభివృద్ధి సంక్షేమాల కోసం పథకాలు రూపొందిస్తాయి. వాటి అమలు కోసం అనేక విధానాలను అవలంబిస్తాయి. ఎవరైనా ఎప్పుడైనా విధాన తీరును ప్రశ్నించాలి కానీ.. ఆ పథకంతో లబ్ధిపొందుతున్న వర్గాలను అవమానించేలా విమర్శలు చేయడం తగదు.
ఉద్యమ సమయంలో తెలంగాణపై విషం గక్కుతూ.. ఆంధ్ర నాయకులను హీరోలుగా, తెలంగాణ ఉద్యమ నేతలను జీరోలుగా పరాయి మీడియా ప్రచారం చేస్తున్నప్పుడు తెలంగాణ ప్రజల పక్షాన నిలిచింది ‘నమస్తే తెలంగాణ’. తెలంగాణ ప్రజల గుండె చప్పుడై నినదించింది. ఉద్యమాన్ని ముందుండి నడిపించింది. తెలంగాణ ప్రజల్లో ఆత్మ ైస్థెర్యాన్ని నింపింది. అలాంటి పత్రికపై కించపరిచే వ్యాఖ్యానాలు చేయడం, తమదే గొప్ప పత్రిక అన్నట్లుగా మాట్లాడటం గర్హనీయం. ‘నమస్తే తెలంగాణ’ను కించపర్చటమంటే తెలంగాణ ప్రజల గౌరవ పతాకను అవమానించడమే. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, పత్రికలు, ప్రభుత్వ పథకాలు, సంస్కృతిపై పరాయి మీడియా తన విద్వేషపూరిత వ్యాఖ్యానాలు మానుకోవాలి. లేదంటే తెలంగాణ ప్రజలే తగిన బుద్ధి చెప్తారు.
– బండారు జితేందర్
93935 41667