హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత కరువు ప్రాంతాలైన మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, గద్వాల, రంగారెడ్డి తదితర జిల్లాల ప్రజల దశాబ్దాల దాహార్తిని, సాగునీటి కష్టాలను తొలగించాలని సంకల్పించి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ఏపీ సర్కారు మరోసారి విషం కక్కింది. ఒకవైపు అనుమతులు లేకుండా, అపెక్స్ కౌన్సిల్లో పెట్టకుండానే అక్రమంగా అనేక ప్రాజెక్టులను నిర్మిస్తున్న ఏపీ ప్రభుత్వం మరోవైపు తెలంగాణపై ఫిర్యాదులకు తెగబడుతున్నది. ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇవ్వొద్దని కేంద్రానికి లేఖ రాసింది. కేంద్ర జలశక్తిశాఖకు, కేంద్ర పర్యావరణ, అటవీ శాఖకు, కృష్ణారివర్ బోర్డుకు వేర్వేరుగా ఏపీ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్రావు శుక్రవారం లేఖ రాశారు. ప్రాజె క్టు రెండో దశ అనుమతుల కోసం తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన డీపీఆర్ కేంద్ర అటవీ, పర్యావరణశాఖలు, సీడబ్ల్యూసీ పరిశీలనలో ఉన్నది. ఈ తరుణంలో ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవోను కూడా రద్దు చేయాలని సీడబ్ల్యూసీకి రాసిన లేఖలో కోరింది. ప్రాజెక్టు డీపీఆర్ను అపెక్స్ కౌన్సిల్లో పెట్టి ఆమోదం పొందాలని తెలంగాణకు నిర్దేశం చేయాలని కృష్ణా రివర్ బోర్డుకు లేఖ రాసింది.